Begin typing your search above and press return to search.

బీసీ సెగ : ఆ కార్డు తో వైసీపీ మీదకు...?

By:  Tupaki Desk   |   18 May 2022 1:30 PM GMT
బీసీ సెగ : ఆ కార్డు తో వైసీపీ మీదకు...?
X
బీసీలు ఇపుడు ఏపీలో గెలుపుని తెచ్చే కీలకమైన ఓటు బ్యాంక్ గా ఉన్నారు. నిన్నటిదాకా బీసీ ఓటు బ్యాంక్ టీడీపీది. ఆ పార్టీకి చెక్కు చెదరని ఓటు షేర్ బీసీలదే. అయితే వైసీపీ ఇపుడు వాటా కోరుకుంటోంది. 2019 ఎన్నికల్లో వచ్చిన బీసీల ఓట్లను తమకు శాశ్వ‌తం చేసుకోవాలని చూస్తోంది.

ఈ నేపధ్యంలో వీలు కుదిరిన ప్రతీసారి పదవులు బీసీలకు పంచుతూ వారిని ముందు పెట్టి రాజకీయాన్ని స్టార్ట్ చేసింది. ఈ మధ్య మంత్రి వర్గ విస్తరణ జరిగితే పది మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చారు. ఇపుడు నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు ఇచ్చారు.

ఇలా తమది బీసీ పక్షపాత పార్టీ అని వైసీపీ గట్టిగా సౌండ్ చేస్తోంది. దాంతో ఒక్కసారిగా అలెర్ట్ అయింది టీడీపీ. వరసబెట్టి బీసీ అగ్ర నేతలు వైసీపీ మీద తమ బాణాలను ఎక్కుపెట్టారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామక్రిష్ణుడు బీసీలకు వైసీపీ చేసే మేలు ఏముందని ఎకసెక్కమాడారు.

మీ బీసీ మంత్రులు నోరు లేని వారు, వారి నోరు నొక్కి అసలైన అధికారాన్ని మీరే అనుభవిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. యనమల అయితే ఒక అడుగు ముందుకేసి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చుగా జగన్ అంటూ పెద్ద ప్రశ్నే వేశారు. అయ్యన్నపాత్రుడు అయితే తెలంగాణాలో ఉన్న బీసీలను తెచ్చి ఏపీలో పదవులు ఇస్తున్నారని అని మండిపడ్డారు.

ఏపీలో బీసీలు లేరా జగన్ అంటూ సెటైర్లు వేశారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుదు అయితే జన్మల దాకా కధను తీసుకుపోయారు. ఎన్ని జన్మలు అయినా జగన్ బీసీలను టీడీపీ నుంచి విడదీయలేరు అని గట్టిగానే మాట్లాడుతున్నారు.

బీసీల గురించి చెప్పుకునే అర్హత వైసీపీకి అసలు లేదని కూడా అన్నారు. వైసీపీ బీసీలకు ఎంపీలు ఇచ్చిందని అంటున్నారు, కానీ ఆ ఇద్దరూ టీడీపీ నుంచి వెళ్ళినవారే అని కూడా అచ్చెన్న చెప్పడం ద్వారా బీసీ లీడర్లు ఎవరైనా తమ వారే అని చెప్పేశారు.

మొత్తానికి చూస్తూంటే ఏపీలో బీసీ రాజకీయం స్టార్ట్ అయింది. బీసీలు మావారు అంటే మావారు అని రెండు పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయి. ఈ విషయంలో ఇపుడు ఏకంగా ప్రాంతీయ కార్డుని కూడా టీడీపీ ముందుకు తెచ్చి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పదవులు పంచడానికి ఏపీ సరిపోలేదా. ఇక్కడ బీసీలు అంతలా పనికిరాని వారు అయ్యారా అని ఎకసెక్కం చేయడం వెనక వైసీపీ పొలిటికల్ మైలేజ్ ని గట్టిగా అడ్డుకోవడమే ఉందని అంటున్నారు.

మరి ఏపీలో యాభై శాతానికి పైగా బీసీలు ఉన్నారు. వారు వచ్చే ఎన్నికల్లో ఏ వైపు నడిస్తే ఆ పార్టీదే అధికారం. జగన్ ఎత్తుగడలతో బీసీ కార్డు అందుకున్నారు. దాన్ని చిత్తు చేసేందుకు టీడీపీలోని స్ట్రాంగ్ బీసీలు ఇపుడు రంగం మీదకు వచ్చారు. మొత్తానికి కధ ఎంత దాకా వచ్చిందంటే బీసీ సీఎం అనేంటంతగా.

వైసీపీని బీసీ సీఎం అని అడుగుతున్న టీడీపీ నేతలు చంద్రబాబు తన బదులుగా బీసీ సీఎం ని చేస్తారా అని వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బీసీ ఓట్ల రేసులో జగన్, చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. రేపటి రోజున ఈ జోరు కాస్తా పెరిగితే బీసీల నుంచి ముఖ్యమంత్రి పదవికే నేరుగా డిమాండ్ రావచ్చు. అపుడు బాబు, జగన్ ఏం చేస్తారో చూడాలి.