Begin typing your search above and press return to search.

ఏపీలో వజ్రాన్వేషణ మొదలైంది!

By:  Tupaki Desk   |   16 May 2022 5:21 AM GMT
ఏపీలో వజ్రాన్వేషణ మొదలైంది!
X
తొలకరి జల్లులు పడగానే సాధారణంగా రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతారు. కానీ ఇక్కడ కొందరు వజ్రాల కోసం అన్వేషిస్తారు. వర్షం పడగానే ఏదో ఒక వజ్రం దొరుకుతుందని, దాంతో కోటీశ్వరులు కావొచ్చనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి తరలివస్తారు. రకరకాల వజ్రాలను సొంతం చేసుకున్న కొందరు కోటీశ్వరులయ్యారు. దీంతో ఇక్కడ వజ్రాల వేట నిరంతరం కొనసాగుతోంది. అయితే వజ్రాల వేటకు చాలా మంది ఇక్కడికి రావడంతో తమ పొలాలు నాశనం అవుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు వజ్రాల కోసం వచ్చేవారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఇంతకీ ఈ వజ్రాల స్టోరీ ఏంటీ..? ఇవెక్కడ లభ్యమవుతున్నాయి..?

ఏపీలోని కర్నూలు జిల్లా పత్తి కొండ నియోజకవర్గంలో తొలకరి వర్షంతో పొలాల్లో జనాలు కనిపిస్తారు. అయితే వీరంతా వ్యవసాయం పనులు చేసుకుంటున్నారని అనుకుంటారు. కానీ వారు వజ్రాల కోసం అన్వేషిస్తారు. ఇక్కడి భూముల్లో వజ్రాలు లభ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిరూపిత మైంది.

దాదాపు 40 ఏళ్లకు పైగా ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ జరుగుతోంది. గతేడాది జొన్నగిరికి చెందిన ఓ రైతుకు ఓ వజ్రం లభించడంతో అది రూ.1.20 కోట్ల ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధికంగా ధర పలికిన వజ్రం ఇదే. వజ్రాన్ని భట్టి ధర నిర్ణయిస్తారు. తొలకరి సీజన్ ప్రారంభం కాగానే కొందరు తమ అనుచరులను ఇక్కడికి పంపించి వజ్రాన్వేషణ సాగిస్తారు.

భారీ వర్షాలు కురిసినప్పుడు స్థానికులే కాకుండా వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జల్లాల నుంచి పలువురు ఇక్కడికి తరలివస్తారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలానికి చెందిన పగిడిరాయి, తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, జి.ఎర్రగుడి, ఉప్పరపల్లి, గిరిగెట్ల గ్రామాల్లో వజ్రాల వేట కొనసాగుతుంది. అలాగే మద్దికెర మండలంలోని పెరవలి, బసినేపల్లిలో.. అనంతపురం జిల్లాలోని బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి, వజ్రకరూర్ తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తారు. ప్రతీ ఏటా పిల్లా పాపాలతో ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు ఉంటారు. వజ్రాల వేట పూర్తవగానే వెళ్లిపోతారు.

ఈసారి తొలకరి జల్లులు అప్పుడే పడ్డాయి. దీంతో కొందరు వజ్రాల వేట సాగిస్తున్నారు. అయితే వజ్రాన్వేషణలో భాగంగా 2000 సంవత్సరంలో రాంపల్లిలో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని ఆ వజ్రాన్ని ట్రెజరీకి పంపారు. అప్పటి నుంచి టెండర్లు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు చాటు మాటుగా వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి వజ్రాన్వేషణ చూసి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 2013లో బంగారం నిక్షేపాల వెలికతీతకు జియోమైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతులిచ్చింది.

వజ్రాన్వేషణతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పొలాలు తొక్కడం వల్ల నేల గట్టిగా మారుతుందని అంటున్నారు. దీంతో పంటకు అనుకూలంగా భూమిని చదును చేయడానికి అదనంగా ఖర్చవుతుందని అంటున్నారు. అయితే కొన్నిగ్రామాల్లో వజ్రాన్వేషణకు వచ్చేవారిపై జరినిమానాలు విధిస్తున్నారు. ఇతర ప్రాంతాలవారెవరైనా ఇక్కడ కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.