Begin typing your search above and press return to search.

టీడీపీ నోట మాట రాకుండా చేశారా... ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:30 AM GMT
టీడీపీ నోట  మాట రాకుండా చేశారా... ?
X
తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు పెట్టింది పేరు. ఏ విషయంలో అయినా తనకు అనుకూలతను చూసుకోవడంతో నేర్పరి. ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఇలాంటి విషయాల్లో దిట్ట అంటారు. అందుకే ఆయనకు అపర చాణక్యుడు అని పేరు. అలాంటి టీడీపీ ఇపుడు కంప్లీట్ సైలెన్స్ అయింది. అయిందా అలా చేశారా అంటే రెండవదే నిజం అనుకోవాలి. ఇంతకీ అదేంటి అంటే కొత్త జిల్లాల ప్రకటనలో ఎన్టీయార్ పేరుని కూడా కలపడం.

తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీయార్. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేవు. ఆయన తెలుగు వారి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసారు. ఆయన పోయి ఇరవై ఆరేళ్ళు గడచినా ఆయనను తలచుకోని తెలుగు లోగిలి ఉంటదు. అటువంటి ఎన్టీయార్ కీర్తిని చరిత్రలో నిలిపే ప్రయత్నం అయితే ఈ ఇరవై ఆరేళ్లలో గట్టిగా ఎక్కడా జరగలేదు అనే చెప్పాలి.

నిజానికి ఎన్టీయార్ చనిపోయిన తరువాత ఉమ్మడి ఏపీ, విభజన ఏపీని కలుపుకుని పద్నాలుగేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే మిగిలిన 12 ఏళ్ల కాలమే ఇతర ముఖ్యమంత్రులు ఉన్నారన్న మాట. అయితే అందులో పదేళ్ళు ఉమ్మడి ఏపీకి వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ సీఎంలుగా పనిచేశారు. నాడు వారు హయాంలో ఎన్టీయార్ కి భారత రత్న వంటి ప్రతిపాదనలు వెళ్లలేదు.

అది రాజకీయమే అనుకున్నా చంద్రబాబు సీఎం గా ఉండగా కేంద్రంలో చక్రం తిప్పిన రోజుల్లో కూడా భారత రత్నను అన్నగారికి ఇప్పించలేకపోయారు అన్న విమర్శ ఉంది. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ కూడా ఎన్టీయార్ ని గౌరవించింది. ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టి మరి పెద్దాయనను సమాదరించింది.

విభజన ఏపీలో కొత్త జిల్లాలు వస్తాయని, వాటిలో ఒకదానికి అన్న గారి పేరు పెట్టాలని గతంలో డిమాండ్లు ఉన్నాయి. అయితే చంద్రబాబు ఎందుకో విభజన ఏపీలో తొలి అయిదేళ్ళూ సీఎం గా ఉన్నా ఆ పని చేయలేకపోయారు. ఇక పాదయాత్రలో జగన్ క్రిష్ణా జిల్లాలో ఎన్టీయార్ సొంత ఊరు గుడివాడలో అన్న గారి పేరును జిల్లాకు పెడతామని చెప్పారు.

ఇపుడు ఆ పని జగన్ చేసి చూపించారు. అయితే దీని మీద అందరి కంటే ఎక్కువగా సంతోషించాల్సింది టీడీపీనే. ఎందుకంటే ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు. ఎందరికో రాజకీయంగా జన్మను ఇచ్చారు. ఈ రోజుకీ టీడీపీకి పునాది, ఆత్మా అంటే ఎన్టీయారే. అలాంటి మహానుభావుడి పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తే టీడీపీ మౌనంగా ఉంది.

ఎవరూ ఈ అంశం మీద తొందరపడి కామెంట్స్ చేయవద్దు అని పార్టీ ఆదేశాలు వెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ అలా కనుక మౌనంగా ఉంటే అది అన్న గారిని అవమానించినట్లే అంటున్నారు. ఎన్టీయార్ ఫోటోకు కానీ విగ్రహానికి కానీ దండ వేయకుండా టీడీపీ ఏ కార్యక్రమం ప్రారంభించదు, అలాంటి ఎన్టీయార్ పేరుతో ఒక జిల్లా వస్తే స్వాగతించడం ఆ పార్టీ బాధ్యత.

అయితే సానుకూలంగా రియాక్ట్ అయితే పొలిటికల్ మైలేజ్ వైసీపీకి పోతుంది. అందుకే టీడీపీ వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయించింది అంటున్నారు. అదే టైమ్ లో అల్లూరి పేరు, సత్యసాయి పేర్లతో జిల్లాలు రావడం పట్ల ఆయన సంఘాలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీయార్ పేరుని జిల్లాకు పెట్టి టీడీపీ నోట మాట రాకుండా జగన్ వ్యూహాత్మకంగా చేశారా అంటే అవూని అనే జవాబు వస్తోంది. రాజకీయాలు ఎలా ఉన్నా ఎన్టీయార్ పేరుతో జిల్లాను తీసుకురావడం పట్ల అన్న గారి కోట్లాది అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.