Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌ర్ల‌కు - ఎస్పీల‌కు జ‌గ‌న్ విందు..అంతేకాకుండా..

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:05 AM GMT
క‌లెక్ట‌ర్ల‌కు - ఎస్పీల‌కు జ‌గ‌న్ విందు..అంతేకాకుండా..
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త‌న టీం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రలో 13 జిల్లాల కలెక్టర్లు - ఎస్పీలకు ఆయ‌న విందు ఇవ్వ‌నున్నారు. ఈ విందులో మంత్రులు - వైసీపీ ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నట్లు స‌మాచారం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం చేపట్టిన స్పందన కార్యక్రమంపై వారితో చ‌ర్చించ‌నున్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై జగన్ ఇష్టాగోష్టిగా స‌మీక్ష‌ చేయనున్నారు. అమరావతిలో ఇచ్చే ఈ విందులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌లు స‌ర్‌ ప్రైజ్‌ లు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

వ‌చ్చే మంగళవారం రాత్రి కలెక్టర్లకు - ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ రాజ‌ధానిలో విందు ఏర్పాటు చేశార‌ని స‌మాచారం. జిల్లాకు ఒక టేబుల్ చొప్పున మొత్తం 13 టేబుల్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు మ‌రియు ఎస్పీలు పాల్గొనే ఈ విందులో ఒక్కో టేబుల్ వద్ద ఆ జిల్లాల గురించి 10 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నట్లు స‌మాచారం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చే ఈ విందుపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది.

పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తన కళ్లు - చెవులు అని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రజలకు - ప్రభుత్వానికి కలెక్టర్లు వారధి లాంటి వారని ఆయ‌న ప్ర‌క‌టించారు. వీడియో కాన్ఫరెన్స్ ల కన్నా క్షేత్రస్థాయి పర్యటనలకే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని ప్రజలు - లబ్ధిదారుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కీలకమని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. రాత్రిపూట ఆస్పత్రులు - హాస్టళ్లు - పల్లెల్లో నిద్ర చేయాలని...రాత్రి నిద్రతో క్షేత్ర స్థాయి పరిస్థితులు మెరుగు పడతాయని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం జ‌గ‌న్ గ‌తంలో సూచించారు. అదే స‌మ‌యంలో కొంత మంది కలెక్టర్లు రాత్రినిద్ర‌కు వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చిందని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాజా విందులో ఏ విష‌యాలు చర్చిస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది.