Begin typing your search above and press return to search.

దివాక‌ర్ ట్రావెల్స్‌ పై స‌ర్కారు కొర‌డా

By:  Tupaki Desk   |   22 Oct 2019 1:59 PM GMT
దివాక‌ర్ ట్రావెల్స్‌ పై స‌ర్కారు కొర‌డా
X
దివాక‌ర్ ట్రావెల్స్‌.. ఏపీలో తిరుగులేని ట్రావెల్స్‌ కు ఇది పెట్టింది పేరు. దివాక‌ర్ ట్రావెల్స్‌ కు అధిప‌తి మాజీ ఎమ్మెల్యే - టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి. ఆయ‌న ద‌శాబ్ధాలుగా ట్రావెల్స్‌ తో అద్దె బ‌స్సుల‌ను ఏపీ కేంద్రంగా న‌డుతుపుతున్నారు. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ కేంద్రంగా దివాక‌ర్ ట్రావెల్స్ న‌డుస్తోంది. అయితే ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఈ ట్రావెల్స్‌ కు ఎదురేలేదు. గ‌తంలో ఈ ట్రావెల్స్‌ పై అనేక కేసులు న‌మోదు అయి ఉన్నాయి. ఎన్నో ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌య్యాయి ఈ ట్రావెల్స్‌. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్రైవేటు ట్రావెల్స్‌ పై ఉక్కుపాదం మోపుతుంది.

అందుకే ట్రావెల్స్‌ లో అనుమ‌తి ఉన్న బ‌స్సులు ఎన్ని.. లేనివి ఎన్ని.. కండిష‌న్‌ లో ఉన్న బ‌స్సులు ఎన్ని.. అందులో ఫిట్‌నేస్ లేని బ‌స్సులు ఎన్ని అని ఆరా తీస్తున్నారు. దివాక‌ర్ ట్రావెల్స్‌లో నిబంధన‌లు ఉల్లంఘించిన అనేక బ‌స్సుల‌ను న‌డుతుపుతున్నార‌ట‌. అందుకే ఏపీ ర‌వాణా క‌మిష‌న‌ర్ కేసుల‌ను న‌మోదు చేసి బ‌స్సుల ప‌ర్మీట్ల‌ను రద్దు చేశారు. ఏపీ ర‌వాణ క‌మిష‌న‌ర్ మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దివాకర్ ట్రావెల్స్ యజమానులు మోటార్ వాహనాల చట్టాలు మరియు అన్ని రకాల నిబంధలను ఉల్లంఘించార‌ని ఆయ‌న తెలిపారు.

వీరు తమ బస్సులను తిప్పుతూ రహదారి భద్రత నిబంధలను అతిక్రమించి - ప్రభుత్వాన్ని మరియు ప్రయాణికులను మోసం చేశార‌ని కూడా ఆయ‌న అన్నారు. 31స్టేజ్ క్యారియజ్ బస్సులను - 18 కాంట్రాక్టు క్యారేజీ బస్సులను రవాణా శాఖా అధికారులు తనిఖీలు నిర్వహించి వాటిపైన కేసులు నమోదు చేసి - 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ట్టు ర‌వాణ క‌మిష‌న‌ర్ తెలిపారు. అన్ని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేసిన విష‌యం సైతం చెప్పారు.

ఈ బస్సు ల ఇన్సురెన్సులు కూడా నకిలీవని ఫిర్యాదులు అందినందున‌ వీటిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నామ‌ని క‌మిష‌న‌ర్ వివ‌రించారు. ఇప్పుడు దివాక‌ర్ ట్రావెల్స్‌ పై కేసులు న‌మోదు కావ‌డంతో టీడీపీకి చెందిన ప‌లువురు ట్రావెల్స్ య‌జ‌మానుల్లో గుబులు మొద‌లైంది. ఆ పార్టీ నేత‌ల‌కు చెందిన ప‌లు ట్రావెల్స్ సంస్థ‌ల‌పై ర‌వాణ క‌మిష‌న‌ర్ న‌జ‌ర్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది.