Begin typing your search above and press return to search.

ఏపీలో ఎందుకంత ఓపెన్.. తెలంగాణలో ఎందుకంత గుట్టు?

By:  Tupaki Desk   |   3 April 2020 10:30 PM GMT
ఏపీలో ఎందుకంత ఓపెన్.. తెలంగాణలో ఎందుకంత గుట్టు?
X
ఒక ప్రమాదకరమైన అంటువ్యాధికి సంబంధించి అనుసరించాల్సిన విధానం ఏమిటి? చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ లాంటి ప్రత్యక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాణాలు తీసే వైరస్ కు సంబంధించిన వివరాల్ని.. దాని బాధితుల సమాచారాన్ని.. మరణాలు చోటు చేసుకుంటే దానికి సంబంధించిన అప్ డేట్స్ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలన్నది ప్రశ్నగా మారక మానదు.

కరోనా లాంటి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? దాని కారణంగా ప్రజలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలన్న దానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సమాచారం మొత్తం బయటకు వస్తే.. ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్న వాదన వినేందుకు బాగానే ఉన్నా.. సమాచారాన్ని అరకొర మాత్రమే బయటకు వస్తే.. ప్రజల్లో అవగాహన మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

అలా అని దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్ కు సంబంధించిన ఒకే పద్దతిని అనుసరిస్తున్నారా? అంటే అలాంటిది కనిపించదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. కొన్ని చోట్ల అయితే.. మరింత దారుణ పరిస్థితి నెలకొని ఉంది. ఎక్కడి దాకానో ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల సంగతే చూద్దాం. కరోనాకు సంబంధించిన ఏపీలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెల్లడించటమే కాదు.. కొత్తగా గుర్తించిన బాధితులు ఏ ప్రాంతానికి చెందిన వారన్న వివరాల్ని జిల్లాల వారీగా అందిస్తున్నారు. దీని కారణంగా.. ఆయాజిల్లాల వారు అప్రమత్తంగా ఉండటమే కాదు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలిగే పరిస్థితి.

గురువారం నాటి సంగతే తీసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతి బహు చిత్రంగా ఉంటుందనిపించక మానదు. ఏపీలో వెలుగు చూస్తున్న కొత్త కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి సర్కారు. గురువారం ఉదయం.. మధ్యాహ్నం మూడు గంటల వేళలోనూ..సాయంత్రం ఆరు గంటల వేళలోనూ.. రాత్రి పది గంటలప్పుడు కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని అన్న విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా గురువారం ఒక్కరోజులోనే కరోనా పాజిటివ్ కేసులు 36గా పేర్కొన్నారు. దీంతో.. ఏపీలో బాధితుల సంఖ్య 149కు చేరుకుంది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం.. విజయనగరం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 మందికి కరోనా సోకితే.. కృష్ణా జిల్లాలో 23 మంది.. గుంటూరులో 20 మంది.. కడపలో 18 మంది.. ప్రకాశంలో 17 మందిగా తేలారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో 15 మంది.. విశాఖలో 11 మంది తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది.. చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ సదస్సులో హాజరైన వారే కావటం గమనార్హం.

ఇంత ఓపెన్ గా ఏపీలో కరోనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నాటి కరోనా పాజిటివ్ కేసుల సమాచారాన్ని రాత్రి పదిన్నర గంటల వేళలో.. మూడు ముక్కల్లో తేల్చేశారని చెప్పాలి. తెలంగాణలో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. మొత్తం 154 మంది పాజిటివ్ అని తేల్చారు. గురువారం ముగ్గురు కరోనా రోగులకు స్వస్థత చేకూరటంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

దీంతో.. ఇప్పటివరకూ తెలంగాణలో డిశ్చార్జ్ అయిన వారు 17కు చేరుకుంది. తాజాగా పాజిటివ్ గా నమోదవుతున్న కేసులన్ని ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావటంతో.. వాటిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. గురువారం పాజిటివ్ గా తేలిన కేసులు.. ఏయే జిల్లాలకు చెందిన వారన్నది తెలంగాణ ప్రభుత్వం వెల్లడించకపోవటం గమనార్హం. ఏమైనా.. కరోనాకు సంబంధించినంత వరకూ అధికారిక సమాచారాన్ని ప్రజల కు పంచుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.