Begin typing your search above and press return to search.

మళ్లీ రాజుకున్న తాడిపత్రి రాజకీయం

By:  Tupaki Desk   |   30 July 2021 10:35 AM GMT
మళ్లీ రాజుకున్న తాడిపత్రి రాజకీయం
X
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అక్కడ మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటీపోటీగా రాజకీయాలు సాగుతుండంతో మున్సిపాలిటీలో రెండో వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది.

తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్ చైర్మన్ ఎన్నికతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18 సీట్లు సాధించింది. వైసీపీ 16 సీట్లు గెలిచింది. ఒక స్తానంలో సీపీఐ గెలవగా.. మరోచోట ఇండిపెండెంట్ గెలుపొందారు.సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా గెలుపొందారు. టీడీపీ జెండాను తాడిపత్రి మున్సిపాలిటీపై ఎగురవేశారు.

తాజాగా సీపీఐ కౌన్సిలర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సంఖ్యా బలం తేడా స్వల్పంగా ఉండడతో చైర్మన్ స్థానంపై ఉత్కంఠ మొదలైంది. రెండో వైఎస్ చైర్మన్ ఎంపికపై తీవ్ర మైన ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఈ పదవికి సంబంధించి ఎన్నిక జరుగనుంది. టీడీపీ, వైసీపీ హోరాహోరీ తలపడుతున్న వేల ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.

అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ స్థానాన్ని జేసీ ఫ్యామిలీ గెలుచుకుంది. ఏపీలోని దాదాపు అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. తాడిపత్రిలో మాత్రం జేసీ బ్రదర్స్ ధాటికి నిలవలేకపోయింది.. జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరుఫున పోటీచేసి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. దీంతో జేసీ బ్రదర్స్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ సైతం ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేసి వారికి కంగ్రాట్స్ చెప్పారు.