Begin typing your search above and press return to search.

కాశ్మీర్‌లో సాధారణ వ్యక్తికి నెంబర్ ఇచ్చిన అమిత్ షా

By:  Tupaki Desk   |   28 Oct 2021 7:30 AM GMT
కాశ్మీర్‌లో సాధారణ  వ్యక్తికి నెంబర్ ఇచ్చిన అమిత్ షా
X
జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉన్నా..దేశంలో ఎక్కడా లేనటువంటి అస్థిరత అక్కడ ఉంటుంది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలనే యోచనలో బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉగ్రదాడుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌ లో మూడు రోజులు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌ లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షా సరిహద్దు గ్రామాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాని ప్రజల భద్రతే తమకు ముఖ్యమని.. జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధే తమ నినాదమంటూ భరోసానిచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా.. పాక్ సరిహద్దుకు సమీపంలోని మక్వాల్‌ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో ముచ్చటించారు.

ఇదే సమయంలో తన మొబైల్ నంబర్‌ ను డైరెక్ట్ గా ఒక సాధారణ పౌరుడికి ఇచ్చి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తనకు ఫోన్ చేయండి. అండగా నిలుస్తామంటూ భరోసానిచ్చారు. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదని, సాధారణ ప్రజల భద్రతే తమ లక్ష్యమంటూ షా పేర్కొన్నారు. అంతేకాకుండా సైనికులతో కూడా ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎలాంటి ఆందోళన లేకుండా దేశానికి సేవ చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భద్రతా సిబ్బందిని అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. అమిత్ షా మక్వాల్ నివాసితులతో ప్రత్యేకంగా సంభాషించారు. గ్రామంలోని ఇళ్లను పరిశీలించి, మంచం మీద కూర్చుని నివాసితులతో మాట్లాడారు. ఈ సమయంలో ఓ ప్రత్యేక సన్నివేశం చోటుచేసుకుంది.

గ్రామస్థులతో షా చెబుతుండగా, గ్రామస్థుడు తనకు సమస్యలను వివరించబోయాడు ఈ క్రమంలో అతనికి తన మొబైల్ నంబర్ ఇచ్చి మీరు నాకు ఫోన్ చేయండి అంటూ చెప్పారు. కశ్మీర్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోంమత్రి అమిత్ షా శ్రీనగర్‌ లో ప్రసంగించారు. ఆ సమయంలో ప్లాట్‌ ఫామ్‌ పై ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ షీల్డ్‌ ను తొలగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మీరంతా.. మీమీ మనస్సులోనుంచి భయాన్ని తొలగించుకోండి. కాశ్మీర్‌ శాంతి, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోని యువతను తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారని.. వారికి ఆయుధాలు, రాళ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీకు దగ్గరగా ఉంది. ఆయా గ్రామాల్లో కరెంటు ఉందా అని అడగండి అంటూ సూచించారు. ఇంకా ఆసుపత్రి ఉందా, మెడికల్ కాలేజీ ఉందా, గ్రామానికి తాగునీరు అందుతుందా, మహిళలకు మరుగుదొడ్లు ఉన్నాయా అంటూ ప్రశ్నలు సంధించారు. అక్కడ మంచి ఏమీ జరగలేదని.. కానీ అలాంటి వారిని పాకిస్తాన్ అణిచివేసి.. యువతను తప్పుదారి పట్టిస్తుందంటూ ఫైర్ అయ్యారు. కాశ్మీర్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్న వారి ఆశయాలు నెరవేరవంటూ.. అమిత్ షా తీవ్రవాద సంస్థలు, ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు.