Begin typing your search above and press return to search.

టార్గెట్ హైద‌రాబాద్‌..అమిత్‌ షా కీల‌క ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   20 Nov 2019 11:02 AM GMT
టార్గెట్ హైద‌రాబాద్‌..అమిత్‌ షా కీల‌క ప్ర‌క‌ట‌న‌
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అస్సాంలో జరిపిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ ఆర్‌ సీ) కసరత్తును దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ - అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ ఆర్‌ సీ త‌ర‌హాలోనే అన్ని రాష్ట్రాల్లో ఎన్ ఆర్‌ సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. వివిధ మ‌తాల‌కు చెందిన వారు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కాగా, హైద‌రాబాద్ టార్గెట్‌ గానే...అమిత్‌ షా ఈ ప్ర‌క‌ట‌న చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మయన్మార్ నుంచి త‌రిమివేయ‌బ‌డ్డ ఆ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు. రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్ - హైదరాబాద్ - ఢిల్లీ - ముంబై - మేవాట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే హైద‌రాబాద్ న‌గ‌రంలో శరణార్థులుగా ఉన్న రోహింగ్యాల కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా సారించారు. మ‌రోవైపు, ఆఫ్రికా దేశాల‌కు చెందిన అనేక‌మంది హైద‌రాబాద్‌ లో అక్ర‌మంగా త‌ల‌దాల్చుకుంటున్నారు. వీరంద‌రిపై కేంద్రం సీరియ‌స్‌ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ‌ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కశ్మీర్ తర్వాత హైదరాబాద్‌ లోనే ఎక్కువ మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న కశ్మీర్ - అసోం వంటి రాష్ట్రాలకు విదేశీయులు వస్తుంటారని.. కానీ దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ రోహింగ్యాలకు ఎలా అడ్డాగా మారిందని ఆయన ప్ర‌శ్నించారు. వీరిలో చాలా మందికి ఆధార్ కార్డ్‌ లు ఉన్నాయని.. వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా....ఇప్ప‌టికే కేంద్రం ఫోక‌స్‌ లో హైద‌రాబాద్ ఉండ‌టంతో... అమిత్‌ షా తాజా ప్ర‌క‌ట‌న‌తో టార్గెట్ హైద‌రాబాద్ అని తెలుస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.