Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీకి అమిత్ షా దిశానిర్దేశం.. ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 PM GMT
తెలంగాణ బీజేపీకి అమిత్ షా దిశానిర్దేశం.. ఏమ‌న్నారంటే!
X
శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర బీజేపీ కోర్‌కమిటీతో కేంద్రమంత్రి అమిత్షా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడి పని చేయాలని కమిటీ సభ్యులకు అమిత్షా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాశ్, మాజీ ఎంపీ వివేక్, డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలతో కొంత ఆలస్యం అవుతుందని.. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగిందని.. ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

ట్విటర్ వేదికగా వస్తున్న కామెంట్ల గురించి ప్రస్తావించిన అమిత్షా.. స్థానిక నేతలే వాటిని తిప్పికొట్టాలన్నారు. ఆపరేషన్ తెలంగాణపై కమిటీ సభ్యులకు అమిత్షా కీలక సూచనలు చేశారు. పార్టీలో కొత్తగా చేరే వారికి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వవచ్చు అనే దానిపై స్పష్టత ఇచ్చారని సమాచారం.

నేతలంతా కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అమిత్‌ షా ఆకాంక్షించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలంతా అమిత్‌ షాకు వివరించగా, ప్రతిగా ఆయన నేతలకు రాజకీయ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్‌తో పోటీ, బీజేపీకి అవకాశాలపై అమిత్‌ షాకు వివరణ ఇచ్చారు.

గత రెండేళ్లుగా పార్టీ అన్ని విషయాల్లో మెరుగుపడిందన్న బీజేపీ నేతలు.. పార్లమెంట్‌, దుబ్బాక, గ్రేటర్‌, హుజురాబాద్‌ ఎన్నికల ప్రస్తావన అమిత్‌ షా దగ్గర తీసుకొచ్చారు. ఆపై మీడియాలో వచ్చిన టీఆర్ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ఆయనకు చూపించారు. ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన నేతలు.. ఈ క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహుల పేర్లను సిద్ధం చేస్తున్నట్లు నేతలు అమిత్‌ షాకు వివరించారు.

ఈ సందర్భంగా.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనిన నేతలతో అమిత్‌షా పేర్కొన్నారు. అందరూ కలిసి పని చేయాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. టీఆర్ఎస్‌ విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యంగా కేంద్రం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్‌ ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు గురించి తెలుసుకున్న అమిత్‌ షా.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని కితాబిచ్చారు.