Begin typing your search above and press return to search.

చైనాకి మరో ఎదురుదెబ్బ ..నిన్న ఇండియా ..నేడు అమెరికా !

By:  Tupaki Desk   |   1 July 2020 10:30 AM GMT
చైనాకి మరో ఎదురుదెబ్బ ..నిన్న ఇండియా ..నేడు అమెరికా !
X
చైనాకు చెందిన 59 యాప్స్ ‌పై నిషేధం విధిస్తూ భారత్ డిజిటల్ స్ట్రైక్ ప్రకటించిన ఒక్కరోజు వ్యవధిలోనే అమెరికా కూడా డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్,జెడ్‌ టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ యూనివర్సల్ సర్వీస్ ఫండ్‌ నుంచి నిషేధించింది. చైనా మిలటరీ,ఇంటలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే, ఈ రెండింటి తో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని తెలిపింది. అమెరికా లో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆధీనం లో ఉంటుంది. ఈ సంస్థ కు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఫండ్ పరిధి లోని పలు ప్రాజెక్టులకు హువావే,జెడ్ ‌టీఈ సప్లయర్స్ ‌గా ఉన్నాయి. ఈ కంపెనీలతో దాదాపు 8.3 బిలియన్ డాలర్ల (రూ.62,676కోట్లు) ఒప్పందం ఉంది. తాజాగా ఎఫ్ ‌సీసీ వీటిపై నిషేధం విధించడం తో ఆ ఒప్పందం రద్దు కానుంది.

భద్రతా ముప్పు నుంచి అమెరికా నెట్‌ వర్క్‌ లను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్ ‌సీసీ వెల్లడించింది. హువావే,జెడ్‌ ఈటీ కంపెనీలు రెండింటికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో పాటు చైనా మిలటరీ తో సంబంధాలున్నాయని ఎఫ్‌ సీసీ చైర్మన్ అజిత్ పాయ్ తెలిపారు. ఆ దేశ ఇంటలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఇవి చైనీస్ చట్టాలకు లోబడి పని చేస్తాయన్నారు.

ఎఫ్ ‌సీసీ కమిషనర్ జెఫ్రీ స్టార్క్స్ మాట్లాడుతూ... అమెరికన్ నెట్‌ వర్క్స్‌లో ఈ రెండు కంపెనీలకు చెందిన నమ్మదగని పరికరాలు ఉన్నాయన్నారు. వీటితో భద్రతా ముప్పు ఉంటుందన్నారు. కాబట్టి అమెరికన్ కాంగ్రెస్ ఈ రెండు కంపెనీలకు కేటాయించిన నిధులను వేరే వాటికి ఇవ్వాలని సూచించారు. అమెరికా ఎఫ్ ‌సీసీ నిర్ణయంపై హువావే,జెడ్‌ టీఈ కంపెనీలు మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.