Begin typing your search above and press return to search.

వైసీపీ గేట్లు తెరిస్తే..మండలిలో ఆధిక్యం ఎంతసేపు : అంబటి

By:  Tupaki Desk   |   23 Jan 2020 12:31 PM GMT
వైసీపీ గేట్లు తెరిస్తే..మండలిలో ఆధిక్యం ఎంతసేపు : అంబటి
X
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకి శాసనసభ ఆమోదం తెలిపి మండలి ఆమోదం కోసం పంపగా ..అక్కడ ప్రభుత్వానికి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. మూడు రాజధానుల బిల్లు కి ఆమోదం తెలుపకుండా సెలెక్టెడ్ కమిటీకి పంపింది. దీనితో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బిల్లులని మండలిలో టీడీపీ అడ్డుకుంటుండటం తో వైసీపీ నేతలు కాకమీద ఉన్నారు.

ఇకపోతే బుధవారం మండలి లో జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం పై మాట్లాడిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిబంధనలకు విరుద్దంగా మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరు పై ఫైర్ అయ్యారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. మహా అయితే కొన్నాళ్ల పాటు వాయిదా వేయించడం తప్ప ఏమీ చేయలేరన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ వెనక్కి తగ్గబోదని చెప్పారు. ఇదే సమయంలో తమ పార్టీ తలుచుకుంటే మండలిలో మెజారిటీ రావడం ఎంతసేపు అని చెప్పుకొచ్చారు.

ఒకవేళ వైసీపీ గనుక వక్ర మార్గంలో వెళ్లాలనుకంటే.. మండలిలో మెజారిటీ సాధించడం ఎంతసేపు అని అంబటి వ్యాఖ్యానించారు. అయితే అలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ విధానం కాదు గనుకనే గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మండలిలో మెజారిటీ లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించారని - కానీ తాము అలా చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయం తప్పో ఒప్పో నిర్ణయించాల్సింది ప్రజలని, మండలి ఛైర్మనో.. చంద్రబాబో కాదని అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్‌ ను చంద్రబాబు ప్రభావితం చేశారని అంబటి ఆరోపించారు. గ్యాలరీలో షరీఫ్‌ కు ఎదురుగా కూర్చొని.. తాను చెప్పినట్టు చేయాలన్న సంకేతాలిచ్చారని అన్నారు.ఒకవేళ తమ నిర్ణయం ప్రజలకు నచ్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో వారే వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఆయన పార్టీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేశారని మరోసారి ఎన్నికల ఫలితాలని గుర్తు చేసారు. రైతులు చంద్రబాబు చెప్పే మాటలకి పడిపోయి - మోసపోవద్దు అని తెలిపారు.