Begin typing your search above and press return to search.

షర్మిలను అస్సలు పట్టించుకోవడం లేదా?

By:  Tupaki Desk   |   13 April 2021 2:30 AM GMT
షర్మిలను అస్సలు పట్టించుకోవడం లేదా?
X
‘దిక్కులు పిక్కటిల్లేలా’ షర్మిల గొంతెత్తినా తెలంగాణలో పార్టీలు ఎందుకు పట్టించుకోవడం లేదు. మొన్నటి సమావేశంలో కేసీఆర్ ను అంత తిట్టినా కూడా ఎందుకు టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు.? రెడ్డిల మయమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నేతలు ఎందుకు ఆమె వెంట నడవడం లేదు.? ఫైర్ బ్రాండ్లు అయిన బీజేపీ వాళ్లు షర్మిలను అసలెందుకు కేర్ చేయడం లేదు? ఇలా ప్రశ్నలన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఏపీ ఆడకూతురు తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వచ్చింది. అయితే ఎంత తెలంగాణ కోడలుగా వచ్చానంటున్నా.. ఆమె ఆంధ్రా మూలాలు వైఎస్ షర్మిలను వెనక్కి లాగేస్తున్నాయి. పులివెందుల బిడ్డ అన్న ఒకే కారణం తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు మైనస్ గా మారుతోంది.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొని వస్తానంటూ ఖమ్మం సభలో ప్రకటించారు వైఎస్ షర్మిల. అయితే ఎంత దూకుడుగా షర్మిల ఊగిపోతున్నా కూడా ఆమెను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు అస్సలు పట్టించుకోవడం లేదట..

ఇక తెలంగాణలో షర్మిల వైపు ఏ పెద్ద నేతలు వెళ్లడం లేదు. ఆమెను పూర్తిగా విస్మరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎవరో కొందరు సెటిలర్స్, మైనార్టీలు, కొందరు రెడ్లు, కొందరు క్రిస్టియన్లు తప్పితే ఆమె వైపు వెళ్లే నాథుడే లేడని అంటున్నారు. ఆమె సైడ్ బలం లేకపోవడంతో షర్మిల ఎంత గొంతుచించుకుంటున్న పాపం ఆమెకు తెలంగాణ రాజకీయవర్గాల్లో కౌంటర్లు ఇచ్చే వారే కరువయ్యారట..

ఎందుకంటే మొన్న ఖమ్మం మీటింగ్ లో కేసీఆర్ ను షర్మిల టార్గెట్ చేసింది. ఆయనపై పరుష పదజాలం వాడింది. టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిపై కూడా కామెంట్ చేసింది. ఆయన కూడా షర్మిల వ్యాఖ్యలపై స్పందించలేదు.

బీజేపీ తరుఫున మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాత్రం షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. ఆమెది కుల పార్టీ అని.. బైబిల్ విజయమ్మ ఆశీర్వాదంతో.. బ్రదర్ అనిల్ భార్యగా సిస్టర్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక షర్మిల ఎన్ని మాటలన్నీ సరే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా గ్రూపులు ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఆమె సైడ్ కాంగ్రెస్ వాళ్లు విపరీతంగా వెళ్తారు అని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లలేదు.

వైఎస్ఆర్ తరుఫున అప్పట్లో అండగా నిలబడ్డ కొందరు వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ‘ఇక్కడ షర్మిల ఎన్ని చేసినా సక్సెస్ కాలేదు అని.. ఆమెను మేము ఆంధ్రా పార్టీగానే చూస్తాం తప్పితే.. తెలంగాణ బిడ్డగా ఎలా చూస్తాం ’ అని చెబుతున్నారట..

ఇక షర్మిల వెంట బీజేపీ నేతలు ఎలాగూ రారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్లు అసలే రారు.. ఎందుకంటే కరుడుగట్టిన తెలంగాణ వాదులు వారు. షర్మిల పార్టీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు అని చెబుతున్నారు.