Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ కు కరోనా గుర్తుకు వచ్చింది

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:30 PM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ కు కరోనా గుర్తుకు వచ్చింది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిసార్లు కొన్నింటికి అమితమైన ప్రాధాన్యత ఇస్తారు. అంతలోనే వాటి గురించి పట్టించుకోవటం మానేస్తారు. ఎందుకలా? అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. కరోనా ప్రారంభంలో.. లాక్ డౌన్ విధించిన కొత్తల్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో పాటు.. వివిధ శాఖల అధికారులతో తరచూ రివ్యూ చేసేవారు. ఒకదశలో డైలీ బేసిస్ లో దీని గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపేవారు. అంతలోనే.. ఆయన ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశారు. రెండు.. మూడు రోజులకోసారి ప్రజల ముందుకు వచ్చి.. కరోనా అప్ డేట్స్ గురించి ప్రజలకు వివరంగా చెప్పేవారు. కేసీఆర్ మాటల్ని వినేందుకు సీరియల్స్ ను.. రియాల్టీ షోలకు మించిన టీఆర్పీ రేటింగ్ ఆయన ప్రెస్ మీట్లకు వచ్చేవి.

అలాంటి కేసీఆర్.. ఉన్నట్లుండి కరోనా గురించి మాట్లాడటం మానేశారు. చాలా రోజుల తర్వాత తాజాగా కరోనా గురించి రివ్యూ మీటింగ్ పెట్టారు. గంటల కొద్దీ ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఎంత ఉందన్న విషయంతోపాటు.. రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తెలంగాణలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనుకోని పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం సిద్ధం కావాలన్న ఆయన.. పలు రాష్ట్రాల్లో పెరుగుతున్నకేసుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కేసుల నమోదు తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు. ఓవైపు పలు రాష్ట్రాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ.. తెలంగాణలో మాత్రం గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మంత్రి కేటీఆర్ భారీ ఎత్తున రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. ఎలాంటి భౌతిక దూరం లేకుండా సాగుతున్న ఎన్నికల ప్రచారం మీద కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెడితే బాగుండు. ప్రగతిభవన్ కు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని పిలిపించుకొని మాట్లాడే ముఖ్యమంత్రి.. ఎన్నికల ప్రచారం విషయంలోనూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటే బాగుండేది కదా?