Begin typing your search above and press return to search.

38 ఏళ్ల తర్వాత.. మిస్ అయిన ఆ జవాన్ల మృతదేహలు దొరికాయి

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:59 AM GMT
38 ఏళ్ల తర్వాత.. మిస్ అయిన ఆ జవాన్ల మృతదేహలు దొరికాయి
X
ఆశ్చర్యం.. అనూహ్యం అన్న మాటలు.. ఈ ఉదంతం గురించి విన్నంతనే మనసులోకి రావటం ఖాయం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఐదుగురు భారత జవాన్ల మృతదేహాల్లో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. వీటిల్లో ఒకటి ఉత్తరాఖండ్ కు చెందిన జవానుగా గుర్తించగా.. రెండో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. మరణించి 38 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి వారి మృతదేహాలు ఏ మాత్రం దెబ్బ తినకుండా చెక్కుచెదరకుండా ఉండటం. నిజానికి ఆ కారణంగానేఇద్దరు జవాన్లలో ఒకరిని గుర్తించగా.. మరొకరిని గుర్తించాల్సి ఉంది. మంచు కొండల్లో.. దట్టమైన మంచులోపల కూరుకొని ఉండటంతో డెడ్ బాడీలు చెడిపోలేదన్న మాట వినిపిస్తోంది. వారి మృతదేహాలు లభించిన చోట మైనస్ డిగ్రీల్లో అక్కడి టెంపరేచర్స్ ఉండటంతో ఏళ్లు గడిచినా చెడిపోలేదన్న మాట వినిపిస్తోంది.

ఇంతకూ అసలేం జరిగింది? వారెలా మిస్ అయ్యారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. పాకిస్థాన్ తో జరిగిన యుద్దం సందర్భంగా ‘ఆపరేషన్ మేఘ్ దూత్’ను చేపట్టారు. భారత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ యుద్ధ క్షేత్రంగా చెప్పే సియాచిన్ కు 19కుమావన్ రెజిమెంట్ కు చెందిన 20 మంది సైనికుల టీం వెళ్లింది. అక్కడ పహరా కాస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా విరుచుకుపడిన భారీ హిమపాతానికి అందరూ కొట్టుకుపోయారు.

ఆ సమయంలో వారిలో 15 మంది మృతదేహాలు లభ్యం కాగా.. మరోఐదుగురు మాత్రం కనిపించలేదు. తాజాగా సియాచిన్ లోని ఒక పాత బంకర్ లో ఇద్దరి మృతదేహాలు లభించాయి. వాటిని తనిఖీ చేయగా.. ఉత్తరాఖండ్ కు చెందిన చంద్రశేఖర్ హర్బోలా అని గుర్తించారు. ఇక.. అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం అల్మోరాలోనే ఉంటున్నారు. 1975లో సైన్యంలో చేరిన చంద్రశేఖర్.. చివరిసారిగా ఇంటి నుంచి 1984 జనవరిలో వెళ్లారని అతడి సతీమణి శాంతీదేవి పేర్కొన్నారు. ఆమె భర్త మృతదేహం లభించిన విషయాన్ని ఆమెకు చెప్పారు. తాను 28 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. అప్పటికే తనకు పెళ్లై తొమ్మిదేళ్లు అయ్యిందని.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. నాలుగేళ్లు.. ఏడాదిన్నరేళ్ల వయసులో ఉన్న ఇద్దరు కుమార్తెలున్నట్లుగా పేర్కొన్నారు. ఇన్నాళ్ల తర్వాత భర్త మృతదేహం లభించినట్లుగా సమాచారం అందటంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. నాటి సంగతుల్ని గుర్తు చేసుకొని ఆమె విలపిస్తున్నారు.