Begin typing your search above and press return to search.

అదానీ అంటే అంత ఇదా....మరీ కారు చౌకగానా..?

By:  Tupaki Desk   |   12 Feb 2022 1:30 PM GMT
అదానీ అంటే అంత ఇదా....మరీ కారు చౌకగానా..?
X
ఈ దేశంలో పాలకులను ఓట్లేసి గెలిపించేది ప్రజలు, వారు బీదా బిక్కీగా ఉంటారు. వారికి పప్పు బెల్లాలు మాదిరిగా సంక్షేమ పధకాలు మాత్రం అమలు చేస్తారు. ఏళ్ళు గడచినా వారి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగా అక్కడే ఉంటాయి. అదే బడా బాబులు అయితే మాత్రం ప్రజలు గెలిపించిన ప్రభుత్వాలతోనే తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటాయి.

ఈ రోజు దేశంలో కార్పొరేట్ సెక్టార్ లో రెండు పేర్లు గట్టిగా వినిపిస్తాయి. అవే అంబానీ, అదానీ. మోడీ సర్కార్ అంతా వారికే అనుకూలం చేస్తోంది అని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇక ఏపీలో అయితే అదానీలకే అగ్ర తాంబూలంగా కధ సాగుతోంది అని విపక్షాలు అంటున్నాయి. వారు ఏది కోరినా రూల్స్ ని పక్కన పెట్టి చేసేస్తున్నారు అని అంటున్నారు.

విశాఖలోని గంగవరం పోర్టులో ప్రభుత్వం తన వాటాను సైతం వదులుకుని మొత్తం యాజమాన్య హక్కులు అదానీకే దఖలు పడేలా ఆ మధ్య కీలక నిర్ణయం తీసుకుంది అని ఆరోపణలు వచ్చాయి. ఇపుడు ఏకంగా విశాఖ శివారులోని మధురవాడలో అత్యంత ఖరీదైన వందల ఏకరాల భూమిని కారు చౌకగా అదానీకి కట్టబెట్టడమే కాకుండా వారు కోరినట్లుగా నిబంధనలను సైతం మార్చేశారు అని విమర్శలు వస్తున్నాయి.

మధురవాడలోని సర్వే నంబర్ 409లో 130 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీకి ప్రభుత్వం ఏడాది క్రితమే కట్టబెట్టింది. అక్కడ ఇపుడు చూస్తే ఎకరం ఇరవై కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరం భూమిని కేవలం కోటి రూపాయలకే ఇచ్చింది. అలా 130 కోట్లకు ఆ భూమిని ప్రభుత్వం నుంచి పొందిన అదానీ సంస్థ అక్కడ ఐటీ పార్క్ తో పాటు, స్కిల్ డెవలప్మెంట్ వర్శిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ వంటివి ఏర్పాటు చేయాలి.

అయితే ఈ భూములను ఏపీఐఐసీ నిబంధనల మేరకు 33 ఏళ్ళు లేదా 99 ఏళ్లకు లీజునకు మాత్రమే ఇస్తారు. వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించినా కూడా యాజమన్య హక్కులు అయితే ఇవ్వరు. కానీ లీజ్ డీడ్ ని కూడా సేల్ డీడ్ గా అదానీ కోసం ప్రభుత్వం మార్చి పూర్తి యాజమాన్య హక్కులను కట్టబెట్టిందని అంటున్నారు. అంతే కాదు, ఏడాది బట్టి అక్కడ ఏ ఒక్క పనీ ప్రారంభించకపోయినా అదానీ మీద వత్తిడి కూడా చేయడంలేదు అని అంటున్నారు.

సేల్ డీడ్ ఉంటే బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం వస్తుంది అన్న ఆలోచనలతోనే అదానీ ఇలా ప్రభుత్వం వద్ద తన పలుకుబడి ఉపయోగించింది అంటున్నారు. దీని మీద విశాఖ సీపీఎం జిల్లా నేతలు ఫైర్ అయ్యారు. ఇదెక్కడి ఒప్పందమని కూడా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను అదానీకి కట్టబెడుతోందని కె లోకనాధం, జగ్గునాయుడు విమర్శించారు.

ప్రభుత్వం ప్రజల ఆస్తిగా ఉన్న 130 ఎకరాల భూమిని 130 కోట్లకు ఇవ్వడం అంటే దారుణమని అన్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్ విలువ మేరకు చూస్తే 2.600 కోట్ల రూపాయలకు పైగా చేస్తుందని వారు అంటున్నారు. మరి అదానీ ఈ రోజుకీ అక్కడ ఏ యాక్టివిటీ చేయకపోయినా సేల్ డీడ్ ఎలా ఇస్తారని కూడా నిలదీస్తున్నారు.

మొత్తానికి చూస్తూంటే ఏపీలో అదానీ హవా బాగా సాగుతోంది అంటున్నారు. అటు పోర్టుల నుంచి ఇటు భూముల దాకా అన్నీ వారికే దఖలు పడుతున్నాయి, దీని వెనక మతలబు ఏంటని కూడా విపక్షాలు నిలదీస్తున్నాయి. సరే ఇంత చేసినా అనుకున్న టైం నాటికి విశాఖలో ఐటీ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ వర్శిటీ వంటివి ఏర్పాటు చేసి యువతకు పాతివేల వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాన్ని నిలబెట్టుకుంటారా అన్నదే చూడాలి అంటున్నారు.