Begin typing your search above and press return to search.

అమరావతి ఖర్చు లెక్కలు చెప్పాలన్న ఏపీ హైకోర్టు

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:36 PM GMT
అమరావతి ఖర్చు లెక్కలు చెప్పాలన్న ఏపీ హైకోర్టు
X
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజధానికి సంబంధించిన చర్చ హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. ఇటీవల గవర్నర్ సంతకం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలోకి కేంద్రం అనుమతి ఉండాలన్న కొత్త పాయింట్ వచ్చి చేరింది. రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందన్న వాదనలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వద్దకు వెళ్లటం.. వారు స్టేటస్ కోను అమలు చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై కేంద్రం బాధ్యతకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. ఈ నేథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తూ.. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశంగా స్పష్టం చేసింది. కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం పరిధిలోని అంశంగా చెప్పిన నేపథ్యంలో తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

ఇదిలా ఉండగా.. రాజధాని అంశంపై జరుగుతున్న విచారణ సమయంలో రాజధాని నిధుల వ్యయం పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం రూ.52వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. దీనిక స్పందించిన త్రిసభ్య ధర్మాసనం.. అసలు ఎంత ఖర్చు చేశారు? ఆ ఖర్చు చేసిన మొత్తం ప్రజల సొమ్ము. ఎక్కడ నిర్మాణాలు ఆగాయో వివరాలు ఇవ్వండి. కట్టిన భవనాలు వాడకుంటే పాడైపోతాయి కదా? ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అంటూ ప్రశ్నలు వేసింది.

ఇప్పటివరకు చేసినట్లుగా చెబుతున్న రూ.52వేల కోట్ల ఖర్చుకు వివరాలు చూపించాలని కోర్టు కోరింది. ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించిన త్రిసభ్య ధర్మాసనం .. ఇప్పటికి ఎంత వ్యయం చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలి? బిల్డింగులు ఎన్ని పూర్తి అయ్యాయి? ఎక్కడ ఆగాయి? లాంటి వివరాల్ని తమకు సమర్పించాలన్నారు. అంతేకాదు.. ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రూ.52వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి ఏ పనులు ఎక్కడివరకు వచ్చాయన్న వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. తాజా విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల కారణంగా ఏపీ రాజధాని కోసం బాబు సర్కారు ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? అందుకుసంబంధించిన నిధుల్ని ఎక్కడ నుంచి తెచ్చారన్న విషయంపై ఒక స్పష్టత రానుందని చెప్పాలి.