Begin typing your search above and press return to search.

ఉద్యోగులు తడాఖా చూపిస్తారుట... ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 3:59 PM GMT
ఉద్యోగులు తడాఖా  చూపిస్తారుట... ?
X
అవును ప్రభుత్వం అంటే ఎవరు. కళ్ళూ ముక్కూ చెవులూ అన్నీ ఉద్యోగులే. వారితోనే సర్కార్ బండి నడవాలి. అటువంటి ఉద్యోగులు ఇపుడు ఏపీలో ఆందోళనాపధంలో ఉన్నారు. కొత్త పీయార్సీ మాకు అసలు నచ్చలేదు అనేస్తున్నారు. తాము కోరుకున్నట్లుగా పీయార్సీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే టైమ్ లో ప్రభుత్వం అయితే ఏపీలో కొత్తగా మరో పదమూడు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దాంతో కొత్త జిల్లాల ఏర్పాటు అంటే కచ్చితంగా ఉద్యోగుల సహకారం కావాలి. అయితే సరిగ్గా ఇక్కడే ఉద్యోగులు తమ పట్టు పంతం కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తమ డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం ఇపుడు కొత్త జిల్లాల పేరిట వత్తిడి చేస్తే తాము ఎందుకు పట్టించుకోవాలీ అన్న ఆలోచన వారికి వస్తోందిట. దీని మీద కాస్తా ఇండైరెక్ట్ గానే ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సహాయ నిరాకరణ తప్పదన్నట్లుగా చెప్పేశారు అంటున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మా చేతనైనంతగా చేస్తామని, తమ పైన జిల్లా కలెక్టర్లు వత్తిడి చేయవద్దని ఆయన చెప్పడం వెనక ఆంతర్యం ఇదేనని అంటున్నారు. అధికారుల వత్తిళ్లకు తాము ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదు అని కూడా పక్కా క్లారిటీగా చెప్పేశారు.

అంటే ప్రభుత్వం కొత్త జిల్లాలు ప్రకటించినా కూడా అడుగు ముందుకు వేయకుండా ఉద్యోగుల నుంచి కచ్చితంగా సహాయ నిరాకరణ అయితే ఎదురవుతుంది అంటున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుంది. వారు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ కీలక సమయంలో వారిని ఎలా దారికి తెస్తుంది. చర్చల బాటను పట్టించి సమస్యను ఎలా కొలిక్కి తీసుకువస్తుంది అన్నది కూడా చూడాలి. మొత్తానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఉద్యోగులు చెప్పకనే చెప్పేస్తున్నారు.