Begin typing your search above and press return to search.

షరీఫ్ స్పీక్స్... టీడీపీ అడ్డంగా బుక్కైంది

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:13 PM GMT
షరీఫ్ స్పీక్స్... టీడీపీ అడ్డంగా బుక్కైంది
X
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా... శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ కు సంబంధించిన చర్చలే నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను తన విచక్షణ మేరకు సెలెక్ట్ కమిటీకి పంపుతున్నానంటూ బుధవారం మండలిలో సంచలన ప్రకటన చేసిన షరీఫ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టీడీపీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న షరీఫ్... ఏనాడూ అంతగా ఎలివేట్ కాలేదు. అయితే జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లు పుణ్యమా అని ఒక్కసారిగా భారీ ఎలివేషన్ పొందారు. అయితే మండలిలో తాను తీసుకున్న నిర్ణయంపై నోరిప్పిన షరీఫ్... విపక్ష టీడీపీని అడ్డంగా బుక్ చేశారనే చెప్పాలి. టీడీపీతో పాటు మండలిలో టీడీపీపక్ష నేత యనమల రామకృష్ణుడిని కూడా షరీఫ్ బుక్ చేసేశారని చెప్పాలి.

బుధవారం నాడు శాసన మండలిలో జరిగిన పరిణామాలు ఆసక్తి రేకెత్తించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలికి వచ్చిన సందర్బంగా వాటిని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా షరీఫ్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ సీటులోని షరీఫ్ ను ఓ వైపు వైసీపీ మంత్రులు, మరోవైపు టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారన్న భావనతో వైసీపీ మంత్రులు షరీఫ్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనను ప్రభావితం చేసేందుకు యత్నించారని టీడీపీ ఆరోపించింది. యనమల మరో అడుగు ముందుకేసి... షరీఫ్ ను వైసీపీ మంత్రులు బూతులు మాట్లాడారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలమే రేపుతోంది.

ఇలాంటి కీలక సమయంలో ఎంట్రీ ఇచ్చిన షరీఫ్.. బుధవారం నాడు మండలిలో ఏం జరిగిందన్న విషయంపై నోరు విప్పారు. తనను వైసీపీ మంత్రులు దుర్బాషలేమీ అడలేదని, అంతేకాకుండా తనను ఏ ఒక్కరూ ప్రభావితం చేయలేదని తేల్చి పారేశారు. తన సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా షరీఫ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ వైస్సార్‌సీపీ నాయకులు నాపై వ్యక్తిగత దూషణలు చేయలేదు. నన్ను మంత్రులు దుర్భాషలు ఆడినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. అదేవిధంగా వారు నన్ను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. మూడు రాజధానులు రావాలా? అమరావతి ఒక్కటే ఉండాలా? అన్నదానిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. శాసనమండలిని రద్దు చేయాలా? వద్దా? అన్నది ప్రభుత్వం ఇష్టం’ అని షరీఫ్ చాలా క్లియర్ గానే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు షరీఫ్ నోట నుంచి వచ్చినంతనే టీడీపీ అడ్డంగా బుక్కైందని చెప్పక తప్పదు.