Begin typing your search above and press return to search.

తృటిలో తప్పించుకున్న ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్..అప్రమత్తమే!

By:  Tupaki Desk   |   31 May 2020 6:03 AM GMT
తృటిలో తప్పించుకున్న ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్..అప్రమత్తమే!
X
మీడియాలోనూ.. సామాజిక మాథ్యమాల్లోనూ పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. మాయదారి రోగానికి సంబంధించి ఏపీలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు బోలెడన్ని. వివిధ రాష్ట్రాల నుంచే కాదు.. ఏపీలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారికి సంబంధించిన వివరాల్ని పక్కాగా నిర్వహించటంతో పాటు.. అలా ప్రయాణించిన వారి మీద డేగకన్ను వేయటం.. విమాన సర్వీసులు షురూ అయ్యాక ప్రయాణికుల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు పక్కాగా ఉన్నాయి. మాయదారి రోగం విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కేర్ మీద ఏపీని వంక పెట్టాల్సిన అవసరమే లేదు.

కానీ.. ఇవేమీ పెద్దగా హైలెట్ కాలేదు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో మాయదారి రోగం అంటకుండా ఉండేందుకు అనుసరిస్తున్న అప్రమత్తత.. విధివిధానాలు చాలా బాగున్నట్లుగా ఉద్యోగ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అప్రమత్తతే ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసును కాపాడిందని చెప్పాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు నిర్వహించటంతో పాటు.. ఎక్కడా రాజీ పడటం లేదు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నాలుగో నెంబరు గేటు వద్ద విధి నిర్వహణ కోసం కర్నూలు నుంచి ఏపీఎస్సీ కానిస్టేబుల్ వచ్చారు.

అలా వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాతే విధి నిర్వహణకు అనుమతిస్తారు. అలా నాలుగు రోజుల క్రితం నిర్వహించిన నిర్దారణ పరీక్షల ఫలితాలు తాజాగా బయటకు వచ్చాయి. సదరు కానిస్టేబుల్ కు పాజిటివ్ గా తేలింది. దీంతో.. అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతనితో ఉన్న పోలీసుల్ని ఖాళీ చేయించారు. అప్రమత్తతే ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కాపాడిందన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.