Begin typing your search above and press return to search.

నా మాటే శాసనం : రివర్స్ గేర్ లో సీన్...

By:  Tupaki Desk   |   17 May 2022 10:51 AM GMT
నా మాటే శాసనం : రివర్స్ గేర్ లో సీన్...
X
నా మాటే శాసనం. ఇది జగన్ మార్క్ రాజకీయం. ఆయన పార్టీ పెట్టి పుష్కర కాలంగా అందరూ చూస్తున్నది, అర్ధమైనది అదే. జగన్ ఏమనుకుంటే అదే చేస్తారు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు అంటూ ఉండదు. ఇక వైసీపీలో ఉండేవారు అంతా జగన్ చెప్పిన మాటను విని తీరాల్సిందే. లేకపోతే వారికి ఇబ్బందులు తప్పవు

ఇప్పటిదాకా ఇలాగే కధ సాగుతూ వచ్చింది. కానీ మూడేళ్ళ పాలన గడచేసరికి ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతోంది. జగన్ కత్తిని పదును తగ్గుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయనకు పార్టీ మీద పట్టు జారుతోందా అన్న మాట కూడా వినిపిస్తోంది. జగన్ అంటేనే తిరుగులేని రామబాణం లాంటి వారు. అటువంటి జగన్ ఒక్కసారి చెబితే చాలు పార్టీ మొత్తం టాప్ టూ బాటం కదిలి తీరాల్సిందే.

కానీ వైసీపీ ప్రతిష్టగా తీసుకున్న గడప గడపకూ వైసీపీ మన ప్రభుత్వం కార్యక్రమం మాత్రం ఏపీలో జరుగుతున్న తీరు చూస్తే జగనన్న మాట అంటే ఎవరికీ ఖాతరు లేదా అన్నదే అందరికీ తోస్తోంది అంటున్నారు. మొత్తం 26 జిల్లాలలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టేసారు. అంతే కాదు, పలు జిల్లాల్లో మంత్రులు కూడా ముఖం చాటేస్తున్నారు.

ప్రతీ గడపకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ చెప్పమంటున్నారు. కానీ జనాలు మాత్రం వాటిలో లోపాలను బయటపెడుతూనే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు. రోడ్లు గురించి పట్టించుకోరా అని నిగ్గదీస్తున్నారు. అదే విధంగా ఇళ్ళ పట్టాల విషయంలో వివక్ష సాగిందని కూడా చెబుతున్నారు. ఇక తమకు సంక్షేమ పధకాలు వివిధ కారణాలతో ఇవ్వడంలేదని చెప్పుకునే వారు బోలెడు మంది.

దాంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ తలనొప్పి పడలేమని గడప గడపకూ కాదు, ఇంటి గడప దాటడం లేదు అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ కార్యక్రమం ఈ టైం లో ఎందుకు పెట్టారో తెలియదు కానీ విపక్షాలు ఇప్పటిదాకా చేస్తున్న విమర్శలు నిజం అనేట్లుగా ఉన్నాయని అంటున్నారు. ప్రజా వ్యతిరేకత బట్టబయలు చేసుకోవడమే ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ సాధించినది అని కూడా అంటున్నారు.

అదే విధంగా వైసీపీలో ఎంత మేరరకు అసంతృప్తి ఉందో కూడా ఈ ప్రోగ్రాం తెలియచేసింది అంటున్నారు. ఇక వాలంటీర్లకే అన్నీ అధికారాలు ఇచ్చి అక్కడ తాడేపల్లి ద్వారా ముఖ్యమంత్రి బటన్ నొక్కేసి మూడేళ్ల పాలన నడిపించారు. ఇపుడు తీరా ఎమ్మెల్యేలు గడపగడపకూ వెళ్ళాలని అంటున్నారు. పాలనలో మాకు ఏ విధమైన ప్రమేయం లేకుండా అన్ని బాధ్యతలూ వాలంటీర్లకు అప్పగించి ఇపుడు ప్రతీ గుమ్మాలు ఎక్కమంటే కష్టమని కూడా వారు అంటున్నారు.

దీంతో ఎమ్మెల్యేలకు ఉన్న బాధ ఏంటి అన్నది ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే మంత్రులు కూడా సరిగ్గా వెళ్ళడంలేదు, వారికి మంత్రి వర్గ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కోరినా కూడా బేఖాతరు చేస్తున్నారు అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు అయినా ఎవరు అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించాలి అంటే కనుక కచ్చితంగా ప్రజలలో ఉండాలన్న జగన్ మార్క్ శాసనం మాత్రం ఎవరికీ పట్టనిదైపోయింది. మొత్తానికి జగన్ మాటే వేదం అని భావించే వైసీపీలో ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.