Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారుపై సోము ఫైర్‌.. వ‌రుస ట్వీట్లు.. రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:30 PM GMT
ఏపీ స‌ర్కారుపై సోము ఫైర్‌.. వ‌రుస ట్వీట్లు.. రీజ‌న్ ఇదే
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. ప్ర‌బుత్వంపైనా రాష్ట్ర బీజేపీ సార‌థి సోము వీర్రాజు విరుచుకుప‌డ్డారు. ఇదేనా పాల‌న అంటూ.. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌డిచిన నాలుగు రోజులుగా రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆయ‌న ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధించారు. అదేస‌మ‌యంలో మంత్రి కొడాలి నాని వ్య‌వ‌హారాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా ఖండించారు. ఈ మేర‌కు వ‌రుస ట్వీట్లు చేశారు. సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని మంత్రి కొడాలి నానికి సంబంధించిన కె. క‌న్వెన్ష‌న్ లో.. కేసినో నిర్వ‌హించ‌డం.. జూదాన్ని నిర్వ‌హించ‌డం.. వంటివాటిపై వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎంట్రీ ఫీజునే రూ.10 వేలుగా నిర్వ‌హించి.. ఎక్క‌డెక్క‌డి వారినో ఇక్క‌డ‌కు ఆహ్వానించి.. జూదాన్ని నిర్వ‌హించిన‌ట్టు కొన్ని ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, సోష‌ల్ మీడియాలోనూ వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

వాస్త‌వానికి గోవా వంటి ఒక‌టి రెండు రాష్ట్రాల‌కే ప‌రిమితమైన ఈ సంస్కృతిని ఏపీలోకి తీసుకురావ‌డం అనేది ఇదే తొలిసారి. ఈ క్ర‌మంలోనే గుడివాడ బికం గోవా! అంటూ.. సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం.. పైగా పోలీసులు క‌నీసం అటువైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం వంటివి అనేక విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వ‌రుస ట్వీట్లు చేశారు.

``కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేందుకే వైసిపి కంకణం కట్టుకుంది. గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారమే తెలుగు సంస్క్రుతిని దెబ్బ తీసే చర్యల్లో భాగమే`` అని సోము వ్యాఖ్యానించారు. అంతేకాదు... క్యాసినోల నిర్వహణ అనేది వైసిపి ప్రభుత్వ పరోక్ష నిర్ణయంలా ఉందనడానికి ప్రత్యేక రుజువులు అవసరం లేదన్నారు. ఈ కేసినో ద్వారా వందల కోట్లు చేతులు మారినా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. చేతులకు తాళ్ళు కట్టుకునే మంత్రి(కొడాలి) ప్రతి విషయానికి స్పందిస్తారు. ఈ విషయంలో ఎందుకు మిన్నకుండిపోయారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి వక్ర భాష్యం చెప్పేలా వైసిపి నాయకత్వం వ్యవహరిస్తోంది. అని సోము వీర్రాజు మండిప‌డ్డారు.

ఇదిలావుంటే, మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా రాష్ట్ర ప్ర‌బుత్వం.. క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంది. ఇది మంగ‌ళ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌స్తోంది. రా్త్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటోంది. అయితే.. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల స‌మ‌యం త‌గ్గించాల్సిన స‌ర్కారు.. వీ టి స‌మ‌యం పెంచుతూ.. ఉత్త‌ర్వులు ఇచ్చింది. వాస్త‌వానికి ఆరంభంలో అంటే.. 2019-20 మ‌ధ్య రా్త్రి 8 గంట‌ల‌కే వైన్ షాపుల‌ను బంద్ చేసేవారు. అయితే.. లాక్‌డౌన్ అనంత‌రం.. వీటి స‌మ‌యాన్ని ఒక గంట‌కు పెంచారు. అంటే.. రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు వైన్ షాపుల‌ను తెరిచి ఉంచుతున్నారు. ఇక‌, ఇప్పుడు వీటి స‌మ‌యాన్ని మ‌రో గంట పెంచుతూ.. ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ విష‌యాన్ని కూడా సోము విమ‌ర్శించారు.

``మద్యంపై ప్రభుత్వం రూట్ మార్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఆడపడుచులకు ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను ఇంకో గంటపాటు పెంచారు. మద్యం అమ్మకాల గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరచి ఉంచాలి. లేదంటే బీజేపీ దీనిపై ప్రజా ఉద్యమం చేస్తుంది`` అని సోము వీర్రాజు హెచ్చరించారు.