Begin typing your search above and press return to search.

అచ్చెన వల్లే అంతా.. స్పీకర్ ఫైర్

By:  Tupaki Desk   |   18 July 2019 9:23 AM GMT
అచ్చెన వల్లే అంతా.. స్పీకర్ ఫైర్
X
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలో ప్రజావేదిక కూల్చివేతపై వాడివేడి చర్చ జరిగింది. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంపై మాటల తూటాలు పేల్చుకున్నారు. ప్రజావేదిక నిర్మాణం అక్రమమని తెలిసినా చంద్రబాబు నిర్మించారని జగన్ విమర్శించారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు ఆ కోవలోనే రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన వైఎస్ విగ్రహాలను కూడా కూల్చాలంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన అచ్చెన్నాయుడు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ ను కోరారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. అచ్చెన్నాయుడు వల్లే సభలో ప్రతీరోజు సమయం వృథా అవుతోందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి సమయం ఇచ్చేది లేదని స్పీకర్ స్పష్టంచేశారు.

రాష్ట్రంలోని గెలిచిన ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ సమస్యలపై మంత్రులను అడగడానికి ప్రశ్నోత్తరాల సమయాన్ని కేటాయించామని.. కాబట్టి అనేక ప్రశ్నలుంటాయని సమయం ఇచ్చేదిలేదని అచ్చెన్నాయుడికి తమ్మినేని స్పష్టం చేశారు. అయినా మైక్ కావాలని పట్టుబట్టిన అచ్చెన్న తీరుపై స్పీకర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సభలో నీవల్లే ఇబ్బంది కలుగుతోందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూడా అచ్చెన్న వైఖరిపై స్పీకర్ ఫిర్యాదు చేశారు.

ఇక మొన్ననే సభలో సమయం వృథా చేస్తున్న అచ్చెన్నాయుడిని స్పీకర్ మందలించారు. అలా అయితే అచ్చెన్నాయుడు మాత్రం మీరే రాసివ్వండి నేను మాట్లాడుతాను అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సమయం ఇచ్చేది లేదంటూ అచ్చెన్నకు స్పష్టం చేశారు. ఇలా స్పీకర్ వర్సెస్ అచ్చెన్నాయుడు ఎపిసోడ్ అసెంబ్లీలో మహారంజుగా సాగుతోంది..