Begin typing your search above and press return to search.

న్యాయ‌పోరాటం చేస్తా.. ఏపీ స‌ర్కారుపై ఏవీబీ ఫైర్‌

By:  Tupaki Desk   |   29 Jun 2022 9:30 AM GMT
న్యాయ‌పోరాటం చేస్తా.. ఏపీ స‌ర్కారుపై ఏవీబీ ఫైర్‌
X
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఆ కేసులో విచారణను ఎదుర్కొంటు న్న ఆయన.. సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగాలపై తాజాగా మరోసారి సస్పెండ్‌ చేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.

విజయవాడలో ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకే అంశంపై ఎవరైనా ఒకరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా..? లీగల్‌గా ఇవేవీ చెల్లవు. న్యాయసమీక్షకు నిలబడే నిర్ణయాలు కావు ఇవి. నాపై ఇంతవరకూ ఏ ఛార్జిషీట్‌ లేదు. రాజకీయ నాయకులకు ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనలు వర్తించవు అనుకుందాం.

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసులున్నాయి.. ఛార్జిషీట్లూ ఉన్నాయి.. ఆమెకు వర్తించని నిబంధనలు నాకెలా వర్తిస్తాయి? ఆర్టికల్‌ 14 కింద ఉన్న సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుంది. ఇవన్నీ పట్టుకొని మరోసారి కోర్టుకు వెళ్లి పోరాడాల్సిందే. అవినీతి జరగని చోట ఏసీబీ కేసేంటి..? అని ప్ర‌శ్నించారు.

ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అబద్ధం. అవి అబద్ధాలు అని నిరూపించేందుకు నా దగ్గర కట్టల కొద్దీ ఆధారాలున్నాయి. అవన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగని చోట ఏసీబీ కేసు పెట్టడం ఏంటి? ఇజ్రాయెల్‌ కంపెనీ అని పదేపదే అంటున్నారు. అదేమైనా సూట్‌కేసు సంస్థా? ఈ విషయంలో ఎక్కడ కూడా మేం ఎవరికీ ఒక రూపాయి కూడా కమీషన్‌ ఇవ్వలేదని సంస్థ స్పష్టంగా చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా ఏసీబీ కేసు పెట్టడం ఏంటి? అవినీతి జరిగినట్లు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ లేవు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మంచి పనులు చేసేందుకు ఎలాంటి పరిమితులూ ఉండవు. నిబంధనలు అతిక్రమించి చెడ్డ పనులు చేస్తే ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.. అని వ్యాఖ్యానించారు.