Begin typing your search above and press return to search.

తాలిబన్ల పాలనకు ఏడాది.. భయపడినంతగా లేకున్నా.. ఒరిగిందీ ఏమీ లేదు

By:  Tupaki Desk   |   16 Aug 2022 10:01 AM GMT
తాలిబన్ల పాలనకు ఏడాది.. భయపడినంతగా లేకున్నా.. ఒరిగిందీ ఏమీ లేదు
X
వారు అధికారంలోకి వస్తే ఘోరాలే అన్నారు.. ఉగ్ర దాడులే అని భయపడ్డారు.. ఛాందసవాదం పెరిగిపోతుందని ఆందోళన చెందారు.. ఇక అక్కడి ప్రజలైతే పారిపోయేందుకు ప్రాణాలకు తెగించారు. ఏకంగా విమానాల చక్రాలు పట్టుకుని అయినా వెళ్లిపోవాలని చూశఆరు. అయితే, వారొచ్చి అప్పుడే ఏడాది అయింది. కానీ, భయపడినంతగా ఆందోళనకరంగా పరిస్థితి ఏమీ లేదు. ఇదంతా అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల పాలన గురించి. గతేడాది ఆగస్టులో అఫ్గాన్ రాజధానికి కాబుల్ ను ఆక్రమించిన తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ పేరిట పాలన సాగిస్తున్నారు.

ఒంటరా..? అంటరానితనమా?తాలిబన్లు అంటేనే ఛాందసవాదం. ఉగ్రవాదం. అందులోనూ అమెరికా, నాటో కూటమి దేశాలు దాదాపు 20 ఏళ్లు ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. చిట్టచివరకు గతేడాది అమెరికా సేనలు పూర్తిగా వైదొలగాయి. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. కొన్నేళ్ల కిందటే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా.. అది అమెరికా కీలుబొమ్మే. కాగా, ఈ కీలుబొమ్మనూ గతేడాది తాలిబన్లు కాలు విరిచేశారు. గతేడాది అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే, వారికో ప్రగతి నిర్దేశం లేదు. ప్రణాళిక అంతకంటే లేదు. తాలిబన్‌లను ఏ దేశమూ నమ్మకపోవడంతో అఫ్గాన్‌ ఒంటరిగా మారింది. దీంతోనే ఏడాది కాలంలో దేశం ఆర్థిక పతనం సహా ఎన్నో ఆటుపోట్లకు గురైంది.

పేదరికం నుంచి నిరుపేదరికంలోకి కొండలు, గుట్టలతో కూడిన అఫ్గానిస్థాన్ అంటేనే పేదరికం. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇదే పరిస్థితి. తాలిబన్లు వచ్చాక మరింత పెరిగింది. ఆర్థిక పతనానికి తోడు విదేశీ సాయం కూడా కొరవడింది. ఇంకేం.. లక్షలాది మంది పేదరికం నుంచి నిరుపేదరికంలోకి వెళ్లారు. అయితే, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి... బాలికలు, మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇబ్బంది కలిగించబోమని తాలిబన్లు చెప్పారు. కానీ, దాన్ని కర్కశంగా అణచివేశారు. వయోజనులైన అమ్మాయిలు బయటకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మహిళలు బయటకు రావాలంటే పూర్తిగా బురఖా వేసుకోవాల్సిందే. అయితే, ఇప్పటికీ చదువుపై ఆశ వీడని వారు అమ్మాయిలను ఏదో విధంగా చదివిస్తున్నారు. అది ఎలాగంటే.. నేరగాళ్లు తలదాచుకున్నట్లు రహస్య, భూగర్భ పాఠశాలల్లో కావడం గమనార్హం.

అవినీతి నిర్మూలనను విజయంగా చెప్పుకొంటూ ఏడాది పాలన అయిన సందర్భంగా తాలిబన్లు సోమవారం బైక్ లపై తిరుగుతూ ర్యాలీలు నిర్వహించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు'ఆగస్టు 15 గర్వించదగ్గ రోజు". అమెరికా రాయబార కార్యాలయం వద్ద ‘డెత్‌ టు అమెరికా’అని నినాదాలిచ్చారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అవినీతి నిర్మూలన, భద్రత పెంపు, గసగసాల సాగుపై నిషేధం.. ఈ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలుగా అఫ్గాన్‌ అధికారిక మీడియా పేర్కొంది.

మిగతా ప్రపంచ గుర్తింపు రానట్లే..ఈ ఏడాదిలో అఫ్గాన్ లో తాలిబన్ల పాలనకు మద్దతిచ్చింది చైనా, పొరుగునున్న పాకిస్థాన్ మాత్రమే. ఈ రెండు దేశాలు వారి పాలనను గుర్తించాయి కూడా. అయితే, మిగతా ప్రపంచం నుంచి మాత్రం గుర్తింపు రావడం లేదు. వస్తుందని భావించడం కూడా కష్టమే. ఎందుకంటే.. అఫ్గాన్ లో మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందనేది వాటి భావన. జర్మనీ విదేశాంగ మంత్రి ఇదే విధంగా వ్యాఖ్యానించారు కూడా. అయితే, ఈయూ మాత్రం.. అఫ్గానిస్థాన్‌, అక్కడి ప్రజలు సుస్థిర శాంతి, సమృద్ధితో వికసించేందుకు తోడ్పడతామని చెప్పుకొచ్చింది. ఇక అమెరికా.. అఫ్గాన్ ను చేయాల్సినంత విధ్వంసం చేశాక చేతులు దులుపేసుకుని వెళ్లిపోయింది.

భారత్ పట్ల సానుకూలతే..ఇదివరకు భారత్ అంటే తాలిబన్లు మండిపడేవారు. ఇప్పటి తాలిబన్లు మాత్రం వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి రెండు ఉదాహరణల్లో భారత్ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.అఫ్గాన్ పునర్ నిర్మాణంలో భారత్ సాయం కావాలంటూ పేర్కొనడం మన దేశం పట్ల మారిన వారి వైఖరికి నిదర్శనం.