Begin typing your search above and press return to search.

సైబర్ మోసం : రూ.99 ఇయర్ ఫోన్స్ కొంటే.. రూ.33 లక్షలు మాయం !

By:  Tupaki Desk   |   24 Nov 2021 3:30 AM GMT
సైబర్ మోసం : రూ.99 ఇయర్ ఫోన్స్ కొంటే.. రూ.33 లక్షలు మాయం !
X
ఈ మధ్య రోజుల్లో ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం అందరికి బాగా అలవాటుగా మారింది. అయితే అదే ఆన్లైన్ షాపింగ్ చాలామంది మోసపోవడానికి కూడా కారణంగా మారుతుంది. ఏదైనా అవగాహనా ఉంటే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి. అవగాహన లేకుండా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తూ, కొంతమంది మోసగాళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. తమ అజ్ఞానంతో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలానే ఓ మహిళ అచ్చంగా 33 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

మౌలాలీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తన భర్తను కోల్పోయింది. ఆమెకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు అందాయి. ఆ డబ్బులతో ముగ్గురు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని భావించిందామె.

అంతా సర్దుకుంటుంది అనుకున్న తరుణంలో రూ.99తో కొన్న ఇయర్ ఫోన్స్ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసాయి. ఏకంగా రూ. 33 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మౌలాలి లో ఉండే ఓ వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవాడు. గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మరణించాడు. ఇన్సూరెన్స్ నుంచి ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అందాయి. ముగ్గురు పిల్లలపై తలా పది లక్షల చొప్పున భార్య ఫిక్సడ్ డిపాజిట్ చేయించింది. తన దగ్గర ఉన్న మిగతా డబ్బులు 2 బ్యాంకు ఖాతాలో ఒక దాంట్లో 28 లక్షలు మరో ఖాతాలో ఐదు లక్షలు జమ చేసింది.

అయితే, 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్లైన్ క్లాసులు వినేందుకు హెడ్ ఫోన్లు కావాలని అడిగింది. ఆన్లైన్ లో కొంటానంటే ఫోన్ ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటి ధర రూ. 500 నుంచి రూ.600 వరకు ఉంది. అయితే, ఓ వెబ్ సైట్ లో 99 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అనే మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది. వారు కొన్న వస్తువును జాగ్రత్తగా ఇంటికి తెచ్చి ఇచ్చారు.

కొన్ని రోజుల తర్వాత ఆమె మరి కొంత డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకి వెళ్ళింది. బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఎంక్వయిరీ చేస్తే సున్నా ఉందని చెప్పారు. ఐదు లక్షలు ఉండాలి కదా అని నిలదీస్తే... మాకేం తెలియదని సిబ్బంది వివరించారు. మరో ఖాతా పరిశీలనకు వేరే బ్యాంకు కి వెళ్లారు.

ఇరవై ఎనిమిది లక్షలు ఉండాల్సిన అకౌంట్ లో రూపాయి కూడా లేదని తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించగా, ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ హ్యాకర్ల కు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు. ఆమె అవగాహన లేమి వారికి కలిసి వచ్చినట్లు గా గుర్తించారు.

ఇయర్ ఫోన్స్ కొన్నందుకు మీకు లాటరీ తగిలింది అని ఆ వెబ్సైట్ నుంచి అశోక్ అనే వ్యక్తి కాల్ చేశాడు. రూ.15 లక్షల విలువచేసే కారును గెలుచుకున్నట్లు చెప్పాడు. కారు వద్దనుకుంటే డబ్బు తీసుకోవచ్చని నమ్మించాడు. ఎస్ఎంఎస్ లో ఉన్న link క్లిక్ చేసి బహుమతి డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయమని సూచించాడు.

ఆమె నిరక్షరాస్యులు కావడంతో ఫోన్ తన కుమార్తెకు ఇచ్చింది. సైబర్ నేరస్తులు చెప్పినట్లుగా ఆ బాలిక ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసింది. బ్యాంక్, డెబిట్ కార్డులు, ఓటిపి ఇతరత్రా వివరాలను చెప్పింది. ఈ సమాచారంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకుని ముందుగా ఫోన్ నెంబర్ మార్చేశారు. కొత్త ఫోన్ నంబర్లపై గూగుల్ పే, ఫోన్ పే ఇనస్టాల్ చేసుకొని, బాధిత మహిళ ఖాతా యాడ్ చేసి పలు ఖాతాలకు 33 లక్షల రూపాయలు బదిలీ చేసుకున్నారు.