Begin typing your search above and press return to search.

బావ ఊసు లేకుండానే బాలయ్య... హిందూపురంలో కొత్త ఒరవడి

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:22 PM GMT
బావ ఊసు లేకుండానే  బాలయ్య... హిందూపురంలో కొత్త ఒరవడి
X
నందమూరి బాలక్రిష్ణ సినిమా స్టార్. ఆయన టాప్ హీరో. అదే టైమ్ లో ఎన్టీయార్ కి రాజకీయ వారసుడిగా కూడా అభిమానులు భావిస్తారు. అయితే బాలయ్య ఎమ్మెల్యేగానే గెలిచి అక్కడే ఉండిపోయారు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో బాలయ్య ఇప్పటికి రెండు సార్లు గెలిచి విజయఢంకా మోగించారు. 2014లో గెలిచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడే ఆయన మంత్రి అవుతారు అని అంతా భావించారు. కానీ అది జరగలేదు.

అయితే బాలయ్య అల్లుడు బాబు కుమారుడు లోకేష్ కి మంత్రి పదవి దక్కడంతో ఆయన దానికే సంతోషపడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో చూస్తే బాలయ్య ఇద్దరు అల్లుళ్ళూ ఓడిపోయారు. బాలయ్య మాత్రం జగన్ వేవ్ లో కూడా రెండవసారి హిందూపురం నుంచి గెలిచి తన సత్తా చాటారు. ఇక వైసీపీలో వర్గ పోరు అక్కడ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో బాలయ్య హవా కూడా బాగా ఉన్న హిందూపురంలో మూడవసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా బాలయ్య తన నియోజకవర్గంలో తాజాగా నలభై లక్షలలతో ఎన్టీయార్ ఆరోగ్య రధాన్ని ప్రారంభించారు. ఈ ఆరోగ్య రధం వాహనం మీద ఎన్టీయార్ ఫోటో ఒక వైపు ఉంటే మరో వైపు బాలయ్య ఫోటో ఉంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో మాత్రం ఎక్కడా లేదు. దాంతో బాలయ్య బాబు గురించి ఏ మాత్రం ప్రస్తావించకపోవడం ఏంటి అన్న చర్చ అయితే బయల్దేరింది.

ఏపీలో చంద్రబాబు పాలన రావాలని, బాబును మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని చెప్పుకునే బాలయ్య ఇపుడు ఇలా చేయడమేంటి అని కూడా టీడీపీలో చర్చ సాగుతోంది. ఇక ఈ ఆరోగ్య రధం విశేషం ఏంటి అంటే హిందూపురంలోని మొత్తం అన్ని గ్రామాల్లో ఇది తిరుగుతుంది. ప్రజలకు ఉచిత వైద్యం చేస్తుంది. ఇందులో ఈసీజీతో సహా అక్సీమీటర్, మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేశామని, 200 వైద్య పరీక్షలు ఇందులో చేసే వెసులుబాటు ఉంది. అలాగే . 107 రకాల మందులు ఉచితంగా రోగులకు అందిస్తారు. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్నీ ఉన్నాయి. మంచి వైద్యులు కూడా ఉన్నారు. దీనికి బసకతారకం క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అటాచ్ చేసి మరిన్ని కొత్త సేవలు అందించాలని కూడా చూస్తున్నారు.

రానున్న రోజుల్లో అవకాశం ఉంటే ఏపీ అంతటా ఇలాంటి అరోగ్య రధాలను నడిపేలా చర్యలు తీసుకుంటామని కూడా బాలయ్య చెబుతున్నారు. తన భార్య వసుంధరతో కలసి ఆయన ఈ ఆరోగ్య రధాన్ని ప్రారంభించారు. మొత్తానికి అంతా తాను తన తండ్రి ఎన్టీయార్ పేరు మీదుగానే ఆయన ఈ కార్యక్రమం జరిపించారు తప్ప ఎక్కడా బావ బాబు గారి గురించి మాట్లాడకపోవడంతోనే రాజకీయ చర్చ‌ పెద్ద ఎత్తున సాగుతోందిపుడు.