Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు

By:  Tupaki Desk   |   23 July 2021 12:35 PM GMT
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు గుర్తించింది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తాన్ని అందజేసినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.

వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన సీబీఐ అధికారుల బృందం దాదాపు 47 రోజులుగా కడప జిల్లాలో మకాం వేసి కీలక విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే 30మందికిపైగానే కీలక అనుమానితులను సీబీఐ అధికారులు నాలుగోదఫా విచారించారు. ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి సోదరులు, వాచ్ మెన్ రంగన్న, పనిమనుషులను విచారించారు.

వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్, రవాణాశాఖ సిబ్బందిని విచారించారు.. హత్య జరిగిన రోజులు వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది. వాహనాల ఓనర్లను విచారించారు. వారి వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు. ఓ ఇన్నోవా వాహనం యజమాని, డ్రైవర్ ను విచారించినట్టు తెలిసింది.

హత్యకు ముందు ఈ ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరాతీశారట.. ఈ కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తూ కేసు విచారణను వేగవంతం చేస్తోంది.

వివేకా హత్య జరిగే ముందురోజు కొన్ని అనుమానిత వాహనాలు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాహనాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఆ వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వీరు ఇచ్చిన సమాచారమే ఈకేసులో కీలకంగా మారనుందని సమాచారం.

కాగా శుక్రవారం వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వైఎస్ వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వాంగ్మూలం కీలకంగా మారబోతోందని తెలుస్తోంది.

సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందిన వారని.. ఇద్దరు సుపారీ ఇచ్చారని.. మరో వ్యక్తి, మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.