Begin typing your search above and press return to search.

జగన్ పాలన నచ్చలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ

By:  Tupaki Desk   |   23 Sep 2021 7:31 AM GMT
జగన్ పాలన నచ్చలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ
X
విషయం ఏదైనా.. ప్రశ్న మరేదైనా సరే తడుముకోకుండా సూటిగా చెప్పేసే అతి కొద్ది తెలుగు నేతల్లో ఒకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విషయాల మీద అవగాహనతో పాటు.. విషయాల్ని విశ్లేషించే నేర్పు.. అపారమైన రాజకీయ అనుభవంతో పాటు.. నిజాయితీగా ఉండటం ఆయనకు మిగిలిన నేతలకు ఉండే ఇమేజ్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ తరఫున పని చేయని ఆయన.. ఒకప్పుడు దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఆయన.. తనను తాను వైఎస్ కు వీర విధేయుడిగా చెప్పుకోవటానికి అస్సలు మొహమాట పడరు.

అంతేకాదు.. వైఎస్ మీద ఉన్న అభిమానం.. ఆయన పిల్లల మీద ఉన్నప్పటికీ.. వారు చేసే తప్పొప్పుల్ని ఓపెన్ గా మాట్లాడే దమ్ము.. ధైర్యం ఉండవల్లి సొంతం. తాజాగా ఆయనో యూట్యూబ్ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్ల పాలన మీద మీ అభిప్రాయం ఏమిటన్న వెంటనే ఆయన తడుముకోకుండా.. తనకు జగన్ పాలన ఏ నచ్చలేదని కుండ బద్ధలు కొట్టేశారు. అంతేకాదు.. ఆయన పాలన నచ్చలేదని.. అదే సమయంలో ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదన్నారు.

‘నాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్సలు నచ్చలేదు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అదే సమయంలో జగన్ పాపులార్టీ ఏ మాత్రం తగ్గలేదు. ఉచిత పథకాలు అందుతున్నాయి. ఫ్రీ బీస్ అందించటానికి ఈయన చేసే పనులు కొంప ముంచే పనులే చేస్తాయి. ఇందులో పెద్ద ఎస్ ఆర్ నో చెప్పటానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన.. చేపట్టిన పథకాలు నాకు అస్సలు నచ్చలేదు’’ అని చెప్పారు.

మరి.. జనాల్లో పాపులార్టీ తగ్గలేదన్నారన్న మాటకు బదులిస్తూ.. తాను జనాల మాట చెప్పలేదని.. తన అభిప్రాయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. కరోనా అనేది జగన్ పాలిట లాభంగా మారింది. కరోనా వేళలోనూ పెన్షన్లు అందాయి. ఆ సమయంలో పెన్షన్లు సకాలంలో అందటం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఎంతో మేలు చేసింది. అందువల్ల పాపులార్టీ తగ్గలేదు. ఆ డబ్బు ఇవ్వటం సరే.. కానీ ఆదాయం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

మనకు ఏదీ ఉచితంగా రాదని.. ఎవరికైనా పది రూపాయిలు ఇచ్చామంటే.. ఎవరో ఒకరి దగ్గర నుంచి లాగిన తర్వాతే ఇవ్వగలుగుతామని.. ఉత్తినే రావన్నారు. ఆకాశంలో నుంచో.. చెట్లకు డబ్బులు కాయవని.. ఎక్కడ నుంచి డబ్బులు తెస్తున్నారన్నది చూసిన తర్వాత ఇది పద్దతి కాదనిపించింది. ఇది రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నారు. ‘అప్పులు కానివ్వండి.. ఆస్తులు అమ్మి కానివ్వండి చేస్తున్నారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అప్పులు చేస్తున్నాయి. వారితో పోల్చినప్పుడు ఏపీ చేస్తున్న అప్పు తక్కువే కదా? అని అంటున్నారు. ఈ వాదన చాలా పెద్ద తప్పు.

అప్పు చేసి.. ఏం చేస్తున్నావ్? అన్నది ముఖ్యం. అప్పు చేసి ఒక స్థలం కొంటే ఆస్తి అవుతుంది. దాని మీద వడ్డీ కట్టినా.. ఆస్తి విలువ కూడా పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని క్యాపిటల్ ఇన్వెస్టు మెంట్ అంటారు. అదే ఇంట్లో రూ.10వేలు అప్పు చేసి ఇంట్లో ఒక ఫంక్షన్ చేసి అందరికి భోజనాలు పెట్టి ఖర్చు చేశారనుకోండి. దాని మీద వడ్డీ కడుతున్నారనుకోండి అది తప్పు. ఎందుకంటే వేడుక కోసం ఖర్చు చేయటం తప్పు. వేడుక కోసం రూ.10వేలు అప్పు చేస్తే తప్పు అవుతుంది. కానీ.. పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేస్తే తప్పు కాదు. ఎందుకంటే.. దాని మీద పెట్టిన అప్పుకు మించి ఆస్తి విలువ పెరుగుతుంది. కానీ.. వేడుక కోసం పెట్టిన ఖర్చు వల్ల ఎలాంటి ఆదాయం తిరిగి రాదు’ అంటూ లోతుగా విశ్లేషించారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మంచివే అయినా.. వాటికోసం అప్పులు చేయటం సరికాదన్న వాదనను ఉండవల్లి వినిపించారు.