Begin typing your search above and press return to search.

తీపి కబురు చెప్పనున్న కేసీఆర్.. డేట్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   4 Aug 2020 7:30 AM GMT
తీపి కబురు చెప్పనున్న కేసీఆర్.. డేట్ ఎప్పుడు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరాల దేవుడన్న పేరున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ఆశలు వదిలేసుకున్న వేళలో.. కొత్త ఆశలు పుట్టేలా ఆయన నిర్ణయాలు ఉంటాయి. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంది.

ఇప్పటివరకు ఆ అంశాన్ని పట్టించుకోనట్లుగా ఉన్న సీఎం కేసీఆర్.. హటాత్తుగా ఈ ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చారు. ఎందుకిలా? దాని వెనుకున్న కారణం ఏమిటన్నది ఆసక్తికరం. ఏ పనిని ఊరకనే చేయని తెలంగాణ సీఎం.. తాజా నిర్ణయం వెనుక చాలానే లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకూ ఆయన ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నరన్న దానిలోకి వెళితే కొత్త విషయాలెన్నో కనిపిస్తాయి.

బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో టేబుల్ ఎజెండాగా పెట్టనున్నారు. ఈ అంశంపై చర్చ జరిపి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరపనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. వయోపరిమితిని పెంచటం వల్ల ప్రభుత్వం మీద పడే అదనపు భారం ఎంతన్న దానిపై ఇప్పటికే అధ్యయనం చేయించారు. మూడు నెలల క్రితమే దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి చేరింది.

ఇంతకాలం ఈ అంశాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడే ఈ నిర్ణయాన్ని తెర మీదకు తీసుకురావటం వెనుక అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 600 నుంచి వెయ్యి వరకు రిటైర్ అయితే.. ఈ నెలలో మాత్రం అందుకు భిన్నంగా 1500 మంది వరకు రిటైర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సందర్భంగా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు భారీగా ఉంటాయని.. ఆ భారాన్ని ప్రస్తుతానికి తగ్గించుకోవటానికి వీలుగా వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. రెండేళ్ల వరకు ఎవరు రిటైర్ అయ్యే అవకాశం ఉండదు. దీంతో.. ప్రతి నెలా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం తగ్గుతుంది. ఒక అంచనా ప్రకారం ఒక ఉద్యోగి రిటైర్ అయితే కనీసం రూ.50 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. చిన్నస్థాయి ఉద్యోగి అయితే ఈ మొత్తం తగ్గుతుందని.. అదే ఉన్నతస్థాయి ఉద్యోగి అయితే ఈ మొత్తం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన నెలకు ఆరేడు వందల మందికి బెనిఫిట్ల మొత్తం చెల్లించే భారం ప్రభుత్వానికి లేకుండా పోతుంది.

ఈ కారణంతోనే ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రభుత్వం తెర మీదకు తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు..టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటంది. అలా అని ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇస్తే ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే వీలుంది.

అలా కాకుండా అందరి ఉద్యోగులకు వర్తించేలా నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ సర్కారు మైలేజీ పెరగటం ఖాయం. ఇన్ని విధాలుగా ప్రభుత్వానికి ప్రయోజనం ఉండటంతో 60 ఏళ్లకు వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే.. దీన్ని రేపు ప్రకటించాలా? ఆగస్టు 15న ప్రకటించాలా? అన్న విషయం మీద తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.