Begin typing your search above and press return to search.

ఊరి కోసం నాసా ఆఫర్ ను కూడా తిరస్కరించింది !

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:30 AM GMT
ఊరి కోసం నాసా ఆఫర్ ను కూడా తిరస్కరించింది !
X
ఎవరైనా కూడా నాసా ఆహ్వానం వస్తే ఎగిరి గంతులేసి , విమానంలో అమెరికాకి ఎగిరిపోతారు. కానీ, అమెరికా కి వెళ్లడం కంటే , తాను పుట్టిన ఊరుకి మేలు చేయడమే మంచిది అని భావించి , ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఇంతకీ ఆమె ఎవరు .. ఎందుకు ఆ ఊరుకి సాయం చేయాలని అనుకుంది. ఆ తర్వాత ఏమైంది అనే విషయాలని చూద్దాం..

తమిళనాడు లోని ఆదనకోట్టై గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి ఏటో వెళ్లి పోయాడు.ఆ తర్వాత తల్లి అళగువల్లి మతి స్థిమితం కోల్పోయింది. తల్లితోపాటు తమ్ముడి బాధ్యతా తీసుకుని తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్దదిక్కుగా గా మారింది జయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇంటర్‌ చదువుతున్న ఆమె గతేడాది నాసా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని జిల్లాలో ప్రథమర్యాంకు సాధించి నాసా పర్యటనకు ఆహ్వానాన్ని అందుకుంది. దీనితో ఆమె అమెరికా వెళ్లేందుకు అవసరమైన విమాన ఛార్జీలను భరించడానికి ‘స్వర్గా ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ రూ.1.6లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యింది.

ఈ సమయంలో ఆ అమ్మాయి స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా అమెరికాకి వెళ్లి వస్తారు. కానీ ఆ డబ్బుని మా ఊరికోసం ఖర్చు చేయండని ఆ స్వచ్ఛంద సంస్థని కోరింది జయలక్ష్మి. మా ఊళ్లో 125 కుటుంబాలుంటే ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం లేదు. చిన్నప్పట్నుంచి బహిర్భూమికి వెళ్లాలంటే భయం. రాత్రిపూట ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాలి. ఈ సమస్యని పరిష్కరించాలంటే చాలా ఖర్చవుతుందన్నారు. నేను అమెరికా వెళ్లడం కన్నా ఆ డబ్బుతో గ్రామ సమస్యని పరిష్కరించడమే ముఖ్యం అనుకున్నా. ఆ నగదును మా ఊళ్లో టాయిలెట్ల నిర్మాణానికి అందించమని ఎన్జీవోను కోరా. అందుకువాళ్లు ఒప్పుకోవడం నా అదృష్టం. ఊళ్లోని 125 ఇళ్లకూ రూ.20వేలు చొప్పున నగదు సహాయాన్ని అందించారు. ఆ మొత్తంతో యువత సాయం తీసుకుని గ్రామవాసులే సొంతంగా నిర్మాణాలను చేపట్టారు. అలా జులైలో ప్రారంభించిన టాయిలెట్ల నిర్మాణం తాజాగా పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న మా జిల్లా కలెక్టర్‌, మరో ఎన్జీవో నన్ను అమెరికాకు పంపడానికి అయ్యే ఖర్చులను ఏర్పాటుచేశారు. కానీ కరోనా ‌ వల్ల వచ్చే ఏడాదికి నా ప్రయాణం వాయిదాపడింది. పెద్దయ్యాక కలెక్టరై గ్రామాభివృద్ధికి కృషి చేస్తా అని చెప్తుంది జయలక్ష్మి .