Begin typing your search above and press return to search.

దేశంలో 60 శాతం మంది విద్యార్థులు నడుస్తూనే స్కూళ్లకి .. ఎన్ఎస్ఓ సర్వేలో వెల్లడి !

By:  Tupaki Desk   |   20 Sep 2020 12:30 AM GMT
దేశంలో 60 శాతం మంది విద్యార్థులు నడుస్తూనే స్కూళ్లకి .. ఎన్ఎస్ఓ సర్వేలో వెల్లడి !
X
దేశంలోని దాదాపు 60 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్టు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు వీరిలో బాలురు .. 57.9 శాతం. కంటే బాలికలే 62 శాతం అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల్లో 12.4 శాతం మంది ప్రజా రవాణాలో స్కూల్స్ కి వెళ్తున్నారు. అలాగే , మరో 11.3 శాతం మంది సైకిల్‌పై వెళ్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతోన్న నాలుగింట మూడొంతల మంది కాలినడకనే వెళ్తున్నట్టు సర్వేలో వెల్లడించింది.

అయితే , కాలినడకన వెళ్లే సెకెండరీ, ఆపై తరగతుల విద్యార్థుల సంఖ్య కొంచెం తక్కువ అని తెలిపింది. సెకెండరీ, సీనియర్ సెకెండరీ విద్యార్థుల్లో నాలుగింట ఒక వంతు మంది సైకిల్‌‌ పై వెళ్తున్నారట. ఇంటి నుంచి పాఠశాలకు మధ్య దూరాన్ని కూడా సర్వేలో అధ్యయనం చేశారు. 77 శాతం గృహాలకు 2 కిలోమీటర్ల లోపల ప్రీ-ప్రైమరీ పాఠశాల, 83.4 శాతం ప్రాథమిక, 75.3 శాతం ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నట్టు గుర్తించారు. కాలినడక పాఠశాలలకు వెళ్లే అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల్లో 61.4 శాతం, పట్టణాల్లో 49.4 శాతం ఉన్నారు. ఇదే బాలికల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 66.5 శాతం, పట్టణాల్లో 50.8 శాతం మంది ఉన్నట్టు తేలింది. పట్టణాల (7.6 శాతం) తో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు (12.6 శాతం) అత్యధికంగా సైకిల్‌ ను వినియోగిస్తున్నారు.

‘గృహ సామాజిక వినియోగం.. విద్య’ పేరుతో చేసిన ఈ సర్వే లో 8,000 గ్రామాలు, 6,000 పట్టణాల్లోని 1.13 లక్షల గృహాలను సందర్శించారు. జులై 2017 నుంచి జూన్ 2018 మధ్య నిర్వహించిన ఈ సర్వే లో వివిధ స్థాయి లోని 1.52 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల పంపిణీ ప్రకారం పాఠశాల స్థాయి పెరిగేకొద్దీ, సమీపంలో ఉన్న పాఠశాలలు సంఖ్య తగ్గుతుంది.