Begin typing your search above and press return to search.

ఎయిమ్స్ లో 480 మంది వైద్య సిబ్బందికి వైరస్ !

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:30 AM GMT
ఎయిమ్స్ లో 480 మంది వైద్య సిబ్బందికి వైరస్ !
X
దేశం లో రోజురోజుకి వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది ఆ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకింది. ఈ వైరస్ బారిన పడి ఎయిమ్స్‌లో ఇప్పటికే ముగ్గురు మరణించారు. వీరిలో ఒకరు ఎయిమ్స్‌ శానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారి కాగా.. మరొకరు ఆస్పత్రి మెస్‌ లో పనిచేసే ఉద్యోగి. ఎయిమ్స్‌లో ఈ ఉదంతం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

దీనితో పలువురు సిబ్బంది, నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ బారిన పడిన సిబ్బంది లో 38 మంది నర్సులు కూడా ఉండటం వీరి ఆందోళనకు కారణం. తమకు అందిస్తున్న పీపీఈ కిట్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆరోపిస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌ లోని నిమ్స్‌ లోనూ కరోనా అలజడి రేపుతోంది. నిమ్స్‌ లో నలుగురు వైద్యులు ముగ్గురు సిబ్బంది కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వివిధ విభాగాల్లో రోగులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారు. పలువురు సిబ్బందిని క్వారంటైన్‌ కు తరలించారు.

అటు ఉస్మానియా ఆస్పత్రిలో 10 మంది మెడికోలకు వైరస్ సోకింది. మొత్తం 280 మంది వైద్య విద్యార్థులను క్వారంటైన్‌ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులకు కరోనా సోకుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పీపీఈ కిట్లు అందిస్తున్నా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా వీరు వైరస్ బారిన ఎలా పడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలో పెరిగితే.. వైద్యుల్లో అభద్రతా భావం పెరిగే ప్రమాదం ఉంది.

పీపీఈ కిట్లు ఇచ్చినప్పటికీ వైద్యులకు వైరస్ ఎలా సోకిందని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, పరీక్షల నిర్వహణ అంశంపై రిటైర్డ్ డీఎంహెచ్ ‌ఓ రాజేందర్, రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డిల్లీ ఎయిమ్స్‌‌లో వైరస్ బారిన పడిన 480 మంది సిబ్బందిలో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది ఆస్పత్రి అటెండర్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా మార్చి నుంచి ఎయిమ్స్‌.. ఔట్ పేషంట్ రోగులకు అందించే వైద్య సేవలను నిలిపేసి పూర్తి స్థాయి లో వైరస్ సేవలు అందిస్తోంది.