Begin typing your search above and press return to search.

టీఎంసీ లో చేరనున్న 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు .. ?

By:  Tupaki Desk   |   5 Jun 2021 5:30 AM GMT
టీఎంసీ లో చేరనున్న 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు .. ?
X
తాజాగా పశ్చిమ బెంగాల్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ముందు బీజేపీ పప్పులు ఉడకలేదు. అయితే , అప్పటి నుంచే సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన నేతలందరినీ ఆకర్షించడం మళ్లీ ప్రారంభించింది. ఏకంగా 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌ లో చేరాలని కోరుకుంటున్నారు. వీరిలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలు కూడా ఉన్నారు. టీఎంసీ నుండి బీజేపీలో చేరిన వారిలో 13 మందికి బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీ-ఫామ్‌ లు ఇచ్చింది. బీజేపీ తరఫున ఎన్నికైన 33 మంది ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంశు రాయ్ కూడా తృణమూల్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంశు రాయ్ తాజా ఎన్నికల్లో బిజ్పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

తృణమూల్‌ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సుభ్రాంశ్ రాయ్‌, బీజేపీని ఉద్దేశించి ఫేస్‌ బుక్ ఖాతా వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై విమర్శలకు బదులు ఆత్మశోధన చేసుకోవాలని బీజేపీకి సూచించారు. పశ్చిమ బెంగాల్ బీజేపీలో ఫిరాయింపులు వట్టి పుకారేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య కొట్టిపారేశారు. ఈ ప్రచారం అంతా అబద్ధం అని అన్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి తొందర పడటం లేదు. దీనిపై శనివారం సమావేశమవుతున్నామని తృణమూల్ ఎంపీ షుఖేందు శేఖర్ రాయ్ చెప్పారు. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై చర్చిస్తామన్నారు. తృణమూల్‌ లో చేరేందుకు సిద్ధం అని మాజీ ఎమ్మెల్యే సరళా ముర్ము, రాజకీయవేత్తగా మారిన ఫుట్ బాలర్ దీపేందు బిశ్వాస్ తమ మనస్సులో మాట బయటపెట్టుకున్నారు. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 213 స్థానాల్లో తృణమూల్, 77 సీట్లో బీజేపీ గెలుపొందింది. వీరిలో 50 మందికి పైగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారే. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని బీజేపీలో చేరారు. కానీ, ఎన్నికల్లో తృణమూల్ బంపర్ విక్టరీ సాధించడంతో ఫిరాయించిన వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.