Begin typing your search above and press return to search.

సండే షాక్.. రికార్డు స్థాయిలో తెలంగాణ పాజిటివ్ లు.. హైదరాబాద్ లో అత్యధికం

By:  Tupaki Desk   |   1 Jun 2020 3:30 AM GMT
సండే షాక్.. రికార్డు స్థాయిలో తెలంగాణ పాజిటివ్ లు.. హైదరాబాద్ లో అత్యధికం
X
మరో చెత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో అత్యధిక పాజిటివ్ కేసులు ఆదివారం ఒక్కరోజున తెలంగాణలో నమోదయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో పాటు.. ఇతరత్రా కారణాలు కలగలిపి.. ఎప్పుడూ లేనంత ఎక్కువగా పాజిటివ్ లెక్క తేలటం షాకింగ్ గా మారింది. ఆదివారం ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా నమోదైన అత్యధిక కేసులు 199 కాగా.. అందులో హైదరాబాద్ మహానగరంలోనే 122 కావటం గమనార్హం.

గడిచిన ఐదు రోజులుగా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు పెంచిన తర్వాత నుంచి కేసుల నమోదు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 196 కాగా.. ఇతర రాష్ట్రాల వారు ముగ్గురు. ఆదివారం ఒక్క రోజులోనే ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు మరణించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో ఆశ్చర్యకరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. ఆదివారం పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిలో 90 శాతం మందికి ఎలాంటి రోగ లక్షణాలు లేక పోవటం. మరి.. వీరందరికి పాజిటివ్ ఎలా వచ్చిందన్న విషయంలోకి వెళితే.. అంతకు ముందు పాజిటివ్ గా తేలిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని పరీక్షలు జరపగా.. ఫలితం పాజిటివ్ గా వచ్చింది.

గడిచిన ఐదు రోజులుగా.. పాజిటివ్ ల సంఖ్య పెరగటమే కానీ తగ్గింది లేదు. ఇందుకు ఒక్కరోజు మాత్రమే మినహాయింపు. మిగిలిన రోజులన్ని ఏ రోజుకు ఆ రోజు కేసుల సంఖ్య కొత్త రికార్డుల దిశగా పయనిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 27న 107 కేసులు నమోదైతే.. 28న 117 కేసులు.. 29న 169 కేసులు.. మే 30న మాత్రం 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తక్కువ పాజిటివ్ లు రావటంతో ఫర్లేదే అనుకున్న దానికి.. బదులుగా 31న (ఆదివారం) ఏకంగా 199 పాజిటివ్ లు తేలటంతో ఒక్కసారి షాక్ తినే పరిస్థితి.

ఆదివారం నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 122 కాగా.. రంగారెడ్డి జిల్లాలో 40.. మేడ్చల్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. అంటే.. మొత్తం 199 కేసుల్లో గ్రేటర్.. దాని పక్కనే ఉన్న రంగారెడ్డి. మేడ్చల్ కలిపే 172 కేసులు కావటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 90 శాతం ఈ మూడు చోట్లలోనే ఉన్నట్లు అర్థమవుతుంది. అంతకంతకూ విస్తరిస్తున్న మహమ్మారి నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.