Begin typing your search above and press return to search.

అమెరికాలో మృత్యుఘోష..ఒక్కరోజే వెయ్యి మంది బలి

By:  Tupaki Desk   |   2 April 2020 4:33 PM GMT
అమెరికాలో మృత్యుఘోష..ఒక్కరోజే వెయ్యి మంది బలి
X
చైనాలో కరోనా వైరస్‌ అడుగుపెట్టినప్పుడు ప్రపంచ దేశాలు అంతగా దృష్టి సారించలేదు. రోజురోజుకు ఆ దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలించి ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. భూగోళమంతా కరోనా వ్యాపించి కల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో చైనాలో మొదలైన మృత్యుఘోష మోగిన అనంతరం ఇప్పుడు ప్రపంచంలో చావు డప్పు మోగుతోంది. చైనాలో మరణ మృదంగం మోగి కొంత శాంతించగా అయితే ఆ దేశంలో కన్నా అధిక సంఖ్యలో ఇప్పుడు పలు దేశాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా - ఇటలీ - బ్రిటన్‌ తదితర దేశాల్లో కరోనా మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. ఆ కరోనా సోకిన వారు పెద్దసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.

అమెరికాలో ఒక్కరోజే వెయ్యి మందికి పైగా కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో అమెరికాలో కలవరం మొదలైంది. ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న అమెరికాలోనే ప్రపంచంలో కన్నా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా నివ్వెరపోతుంది. కరోనా కట్టడికి సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం, వైరస్‌ తీవ్రతను గుర్తించడంలో అమెరికా విఫలమవడంతోనే ఇప్పుడు దారుణ ఫలితం అనుభవిస్తోంది. బుధవారం ఒక్కరోజే వెయ్యి మంది కరోనా బాధితులు కన్నుమూశారు. గతంలో అత్యధికంగా 504 మృతులు ఉండగా ఆ రికార్డును అమెరికానే తిరగరాసింది. తాజాగా 24 గంటల్లో వెయ్యి మంది మృతి చెందడం కలచివేస్తోంది.

ఈ వెయ్యి మంది మృతులతో అమెరికాలో 5,345 మంది మృతి చెందారు. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2,27,061 కేసులు నమోదు కాగా వారిలో 5,345 మంది మృతి చెందడం కలవరపరుస్తోంది. అభివృద్ధి చెందిన దేశంలో ఈ విధంగా మరణాలు సంభవించడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇటలీ కన్నా తక్కువ సంఖ్యలోనే ఉన్నా అగ్రరాజ్యం అమెరికాలో ఈ విధంగా మృతుల సంఖ్య భారీగా ఉండడం అక్కడి ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నివారణకు పక్కాగా చర్యలు తీసుకోకపోవడం.. ఆ వైరస్‌ ను అంచనా చేయడంలో విఫలం చెందడంతోనే ఈ పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. కరోనా మృతుల్లో మొదట ఇటలీ, ఆ తర్వాత స్పెయిన్‌ ఉన్నాయి.