“మేము అలసిపోయాం”.. గ్రీన్ కార్డ్ కష్టాలతో అమెరికా వీడుతున్న భారతీయ దంపతులు
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టెకీ-డాక్టర్ దంపతుల కథ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను.. భారతీయ మేధావులు అనుభవిస్తున్న మానసిక క్షోభను కళ్లకు కడుతోంది.
By: A.N.Kumar | 7 May 2026 8:00 PM ISTఅమెరికా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిభావంతుల కలల దేశం. అక్కడ స్థిరపడితే జీవితం సార్థకమవుతుందని భావించే వారు కోకొల్లలు. కానీ, దశాబ్దాల తరబడి కష్టపడి ఆ దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ వృత్తినిపుణులకు ఇప్పుడు అదే అమెరికా ఒక ‘బంగారు పంజరం’లా అనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టెకీ-డాక్టర్ దంపతుల కథ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను.. భారతీయ మేధావులు అనుభవిస్తున్న మానసిక క్షోభను కళ్లకు కడుతోంది.
నైపుణ్యం ఉన్నా దక్కని గుర్తింపు
ఈ హృదయ విదారక కథనాన్ని ఇమ్మిగ్రేషన్ విశ్లేషకుడు సామ్ పీక్ వెలుగులోకి తెచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా పేర్లు వెల్లడించనప్పటికీ ఆ దంపతుల పరిస్థితి అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయుల వ్యధకు ప్రతిబింబంగా నిలిచింది. భర్త సాఫ్ట్వేర్ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం గడించిన మేధావి. అతని ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రభుత్వం, అతనికి “నేషనల్ ఇంటరెస్ట్ వెయివర్” కూడా మంజూరు చేసింది. అంటే అతని సేవలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమని ఆ దేశమే అంగీకరించింది. అయినప్పటికీ గ్రీన్ కార్డ్ కోసం అతను దశాబ్దాలుగా క్యూ లైన్లోనే వేచి చూడాల్సి రావడం గమనార్హం.
మరోవైపు అతని భార్య అమెరికాలోని ఒక ప్రతిష్ఠాత్మక ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ (గుండె నిపుణురాలు) గా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడుతున్నారు. కానీ ఇతరుల ప్రాణాలు కాపాడే ఆమె తన సొంత కుటుంబాన్ని కలుసుకోవడానికి మాత్రం నోచుకోలేకపోతున్నారు. వీసా స్టాంపింగ్ సమస్యల కారణంగా గత మూడేళ్లుగా ఆమె భారతదేశానికి రాలేకపోయారు.
వీసా స్టాంపింగ్ సంక్షోభం.. తీరని ఆవేదన
ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ప్రక్రియ ఒక పీడకలగా మారింది. అమెరికా వెలుపలికి వెళ్లి తిరిగి రావాలంటే పాస్పోర్ట్పై స్టాంపింగ్ తప్పనిసరి. అయితే 2025 డిసెంబర్ నుంచి భారతదేశంలోని అమెరికా కాన్సులేట్లలో అపాయింట్మెంట్లు దొరకడం గగనమైపోయింది. చాలా మందికి 2027 వరకు తేదీలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. "మేము అమెరికాకు అవసరమైన వాళ్లమని వారే చెబుతారు. కానీ మమ్మల్ని ఎప్పుడూ తాత్కాలిక అతిథులుగానే చూస్తున్నారు. స్వదేశానికి వెళ్లి కుటుంబ సభ్యులను చూసుకోవడానికి కూడా అనుమతి లేని ఈ జీవితం మాకొద్దు" అని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దుబాయ్ వైపు చూపు.. ‘మేధో వలస’ తప్పదా?
అమెరికన్ డ్రీమ్ పట్ల అపారమైన గౌరవం ఉన్నప్పటికీ అనిశ్చితితో కూడిన జీవితం వారిని కుంగదీస్తోంది. "ఇంకో పదేళ్లు ఇలా గ్రీన్ కార్డ్ కోసం ప్రాధేయపడటం కంటే దుబాయ్ వంటి దేశాలకు వెళ్లిపోవడమే ఉత్తమం అనిపిస్తోంది. అక్కడ గౌరవంతో పాటు, మన దేశానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది" అని ఆ టెకీ పేర్కొన్నారు.
అమెరికా పునరాలోచించాల్సిన సమయం
ఈ దంపతుల కథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను భుజాన మోస్తున్న లక్షలాది మంది భారతీయుల సామూహిక ఆక్రందన. గ్రీన్ కార్డ్ కోటాలోని తీవ్రమైన జాప్యం, వీసా నిబంధనల్లోని సంక్లిష్టతలు ఇలాగే కొనసాగితే.. అమెరికా తన అత్యుత్తమ మేధావులను కోల్పోయే ప్రమాదం ఉంది. మేధో వలసను అరికట్టాలంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
