Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ మీడియాకు తెలుగంటే అంత చిన్నచూపా?

By:  Tupaki Desk   |   13 May 2022 10:30 AM GMT
నేష‌న‌ల్ మీడియాకు తెలుగంటే అంత చిన్నచూపా?
X
`బాహుబ‌లి` త‌రువాత ద‌క్షిణాది చిత్రాలంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి టాలీవుడ్ నుంచి ఏ స్టార్ సినిమా మొద‌ల‌వుతోంద‌ని తెలిసిన యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు అటెన్ష్ తో చూస్తున్నారు. ఏ స్టార్ సినిమా విడుద‌లైనా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కోట్ల‌ల్లో కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఉత్త‌రాదిలో మ‌న సినిమాలు భారీ విజ‌యాల్ని సాధిస్తున్నాయి. స్టార్స్ న‌టించిన చిత్రాల‌కు ప‌బ్లిసిటీ లేక‌పోయినా కేవ‌లం మౌత్ టాక్ తోనే ఉత్త‌రాది ప్రేక్ష‌కులు భారీ విజ‌యాల్ని అందిస్తున్నారు.

దీంతో మ‌న సినిమా అంటే ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక అభిమానం మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో హిందీ చిత్రాల‌ని అక్క‌డి ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించ‌డం, ద‌క్షిణాది డ‌బ్బింగ్ సినిమాల‌కు హార‌తులు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే సంద‌ర్భంగా సౌత్ నుంచి ఏ చిన్న కామెంట్ వినిపించినా ఉత్త‌రాది స్టార్ లు వెంట‌నే రియాక్ట్ కావ‌డం మొద‌లైంది.

ఇటీవ‌ల క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ ఇక పై హిందీ జాతీయ భాష కాదు` అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై కొంత దుమార‌మే రేగింది. దీనిపై విష‌యం తెలుసుకోకుండా హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ట్విట్ట‌ర్ లో సుదీప్ కు కౌంట‌ర్ ఇవ్వ‌డం.. ఆ మాట‌లు త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ సుదీప్ కూడా రిట‌ర్న్ కౌంట‌ర్ ఇవ్వ‌డం.. మ‌ధ్య‌లోకి వ‌ర్మ ఎంట్రీ ఇచ్చి దీన్ఇన మ‌రింత వివాదంగా మార్చే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే.

తాజా వివాదాల‌తో టాలీవుడ్ పై నేష‌న‌ల్ మీడియా ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఏ చిన్న స్టార్ కౌంట‌ర్ గా మాట్లాడిన దాంతో న్యూస్ క్రియేట్ చేయ‌డం మొద‌లైంది. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాలీవుడ్ త‌న‌ని భ‌రించ‌లేద‌న్న స్టేట్ మెంట్ పై కూడా ఓ జాతీయ మీడియా డిబేట్ ని నిర్వ‌హించింది. అడివి శేష్ హీరోగా రియ‌ల్ హీరో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `మేజ‌ర్‌` ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ ని ఓ పాత్రికేయుడు `మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు`ని అడిగిన ప్ర‌శ్న‌కు `బాలీవుడ్ న‌న్ను భ‌రించ‌లేద‌ని, తెలుగు ప్రేక్ష‌కులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని కాద‌ని తాను బాలీవుడ్ వెళ్ల‌లేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై పెద్ద దుమార‌మే రేగుతోంది. మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై వ‌ర్మ‌, బాలీవుడ్ నిర్మాత‌లు ముఖేష్ భ‌ట్‌, బోనీ క‌పూర్‌, ఒక‌ప్ప‌టి హీరో సునీల్ శెట్టి త‌లో విధంగా స్పందించారు. కంగ‌న ఏకంగా మ‌హేష్ కు మ‌ద్ద‌తు తెలిపింది. అయితే ఈ ఎంటైర్ వివాదంపై డిబేట్ ని నిర్వ‌హించిన ఓ నేష‌న‌ల్ మీడియా ఛాన‌ల్ మాత్రం ప్పులో కాలేసింది. జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ వున్న ఛాన‌ల్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని ప‌ట్టుకుని క‌న్న‌డ యాక్ట‌ర్ మ‌హేష్ బాబు కాంట్ర‌వ‌ర్సీని సృష్టించారంటూ తాటికాయంత అక్ష‌రాల‌తో ప్ర‌సారం చేయ‌డం తెలుగు సినిమాని, తెలుగును చిన్న‌చూపు చూడ‌ట‌మేన‌ని ప‌లువురు స‌ద‌రు నేష‌న‌ల్ మీడియా ఛాన‌ల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

జాతీయ స్థాయిలో పాపుల‌రిటీని సొంతం చేసుకున్న‌ న్యూస్ ఛాన‌ల్ ఇలా తెలుగును చిన్న చూపు చూడ‌టం ప‌లువురిని ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. ఇంత తెలియ‌కుండా జాతీయ స్థాయిలో న్యూస్ ఛాన‌ల్ ని ఎలా ర‌న్ చేస్తున్నార‌ని ప‌లువురు స‌ద‌రు ఛాన‌ల్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజా సంఘ‌ట‌న‌తో ద‌క్షిణాది అంటే ఉత్త‌రాది వారికి ఎంత చిన్న‌చూపో స్ప‌ష్ట‌మైంద‌ని కూడా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇదే ఛాన‌ల్ గ‌తంలో తెలుగు స్టార్స్ ని క‌న్న‌డ స్టార్స్ గా చిత్రిస్తూ వార్తా క‌థ‌నాల‌ని ప్ర‌చురించి నెటిజ‌న్ ల‌కు అడ్డంగా బుక్కై త‌న తెలివి త‌క్కువ త‌నాన్ని బ‌య‌ట‌పెట్టి న‌వ్వుల పాలైంది. తాజాగా మ‌హేష్ ని క‌న్న‌డ స్టార్ గా పోట్రే చేస్తూ మ‌రో సారి పప్పులో కాలేసి తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది.