Begin typing your search above and press return to search.

ఓటీటీలో రిలీజ్ కానున్న 'బాహుబలి' నిర్మాతల సినిమా...?

By:  Tupaki Desk   |   6 Jun 2020 7:30 AM GMT
ఓటీటీలో రిలీజ్ కానున్న బాహుబలి నిర్మాతల సినిమా...?
X
'కేరాఫ్‌ కంచరపాలెం' లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్న పాత్ర‌లు పోషిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స‌త్యదేవ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబ‌లి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్ మరియు మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాని నిర్మించారు. బ్లాక్ బస్టర్ 'బాహుబలి' సినిమా తర్వాత ఈ సంస్థ మరో పెద్ద సినిమానే తెరకేక్కిస్తుందని అందరు అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా కంటెంట్ ని నమ్మి ఈ చిన్న సినిమాని నిర్మించింది. ఇది మలయాళంలో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన 'మహేషింతే ప్రతీకారమ్' అనే సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. ఇదిలా ఉండగా ఈ సినిమా అన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనాతో ఏర్పడిన పరిస్థితుల వలన రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ తెలుపుతూ సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా థియేటర్స్ లో రావడం కష్టమే అని.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీలో డైరెక్ట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నిజమైందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నెలకొనియున్న సిచ్యుయేషన్స్ లో ఈ సినిమాకి థియేటర్ రిలీజ్ అవ్వదని.. ఓటీటీలో రాబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తయిన ఈ సినిమాని జులై ఎండింగ్ లోపు ఓ ప్రముఖ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే చిత్ర నిర్మాతలకి ఓటీటీకి మధ్య దీనికి సంభందించిన ఒప్పందం జరుగుతోందని.. ఓటీటీ మంచి ఆఫర్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. కాగా ఇప్పటికే దాదాపు అర డజను సినిమాలు థియేటర్స్ రిలీజ్ వదులుకొని ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందేమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.