Begin typing your search above and press return to search.

శంక‌ర్ - చ‌ర‌ణ్ ఎక్క‌డా స్పీడు త‌గ్గ‌ట్లేదు

By:  Tupaki Desk   |   28 Jun 2022 12:30 AM GMT
శంక‌ర్ - చ‌ర‌ణ్ ఎక్క‌డా స్పీడు త‌గ్గ‌ట్లేదు
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి `RRR`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఐదు భాష‌ల్లో దేశ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్‌, విదేశీ ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ మూవీ ఓ అద్భుతం అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త మే నెల 20న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ మొద‌లైంది.

డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ లోనూ ఈ మూవీ దుమ్ముదులిపేస్తోంది. ఈ మూవీ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో త‌న 15వ సినిమాని చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ భామ‌ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, పూణే ల‌లో జ‌రిగింది. ఇటీవ‌ల షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ త‌న వైఫ్ తో క‌ల‌సి త‌న మ్యారేజీ యానివ‌ర్స‌రీ కోసం ఇట‌లీ వెళ్లి అక్క‌డ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.

ఇటీవ‌లే హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తూ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ట్టుగా తెలిసింది. జూలై 1 నుంచి తాజా షెడ్యూల్ ని ప్రారంభించ‌బోతున్నారు. అమృత్ స‌ర్ లో ఐదు రోజుల పాటు షూటింగ్ చేయ‌నున్నార‌ట‌. అక్క‌డ కీల‌క ఘ‌ట్టాల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

ఆ త‌రువాత టీమ్ అంతా హైద‌రాబాద్ తిరిగి వ‌స్తుందని, ఇక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తార‌ని ఇన్ సైడ్ టాక్‌. మిగ‌తా షూటింగ్ మొత్తం హైద‌రాబాద్ లోనే కంప్లీట్ కానుంద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి ప్రారంభం నుంచి వివిధ టైటిల్స్ ప్రచారంలో వున్నాయి.

ముందు విశ్వంభ‌ర అని ఆ త‌రువాత స‌ర్కారోడు అని ప్ర‌చారం జ‌రిగింది. ఇక వీటితో పాటు ఆఫీస‌ర్‌, అధికారి వంటి టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. తాజాగా `సిటిజ‌న్‌` అనే టైటిల్ ని శంక‌ర్ ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది తెలియాలంటే అధికారికంగా టైటిల్ అనౌన్స్ చేసే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 1993 నేప‌థ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ వుండ‌బోతోంద‌ని, రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ క‌నిపిస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో శ్రీ‌కాంత్‌, సునీల్‌, అంజ‌లి, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.