Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు తలైవా రావడం కష్టమే...!

By:  Tupaki Desk   |   29 Sep 2020 8:30 AM GMT
వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు తలైవా రావడం కష్టమే...!
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అన్నాతే'. మాస్ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ కెరీర్లో 168వ సినిమాగా వస్తున్న 'అన్నాతే'పై తలైవా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోవిడ్‌ కారణంగా ఆగిపోయింది. అయితే ఆరు నెలల తర్వాత తిరిగి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 'అన్నాతే'ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారట. నిర్మాతలు ఈ విషయాన్ని ర‌జ‌నీకాంత్ దగ్గర ప్రస్తావించి తిరిగి వ‌ర్క్ లో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తే దీనికి ఆయన సుముఖుత వ్యక్తం చేయలేదని కోలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. పరిస్థితులు చక్కబడే వ‌ర‌కు తాను సెట్స్ లోకి రావ‌డానికి సిద్ధంగా లేనని రజినీకాంత్ సృష్టం చేశాడట. దీంతో తలైవా కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సినిమా షూటింగ్ కి రావడం కష్టమే అని కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. దీంతో రజినీకాంత్ లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించే ప్లాన్ లో డైరెక్టర్ శివ ఉన్నాడని తెలుస్తోంది. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే రజినీ ‘అన్నాత్తే’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా చాలా సమయం వృధాగా పోయింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.