Begin typing your search above and press return to search.

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలు.. ఏకంగా రూ.1.7 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

By:  Tupaki Desk   |   12 Aug 2020 9:50 AM GMT
సింగర్ సునీత పేరు చెప్పి మోసాలు.. ఏకంగా రూ.1.7 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
X
కేటుగాళ్లు మోసాలకు చేయడంలో ఆరితేరి పోయారు. మోసపోయామని గ్రహించేలోపే సొమ్ము లాగేసుకుంటున్నారు. కొందరు దుండగులు ప్రముఖ సింగర్ సునీత పేరును వాడుకొని ఓ అభిమాని నుంచి రూ.1.7 కోట్లు వసూలు చేయడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన మహిళ(44)కు సింగర్ సునీత అంటే ఎంతో అభిమానం. ఆమె పాడిన పాటలు బాగా ఇష్టపడుతుంటారు. ఈ విషయాన్ని గ్రహించిన అదే ప్రాంతానికి చెందిన చైతన్య అనే వ్యక్తి తన దగ్గర సింగర్ సునీత సెల్ నెంబర్ ఉందని, కాల్ చేసి మాట్లాడాలని ఇచ్చాడు. ఆమె రెండు మూడు సార్లు సింగర్ సునీత కి వాట్సాప్ లో మెసేజ్ పంపగా, ఆ నెంబర్ ని బ్లాక్ చేశారు. దీంతో అభిమాని మరో నెంబర్ నుంచి వాట్సాప్ కి మెసేజ్ పంపి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని కోరారు. అటువైపు నుంచి సరే అంటూ సమాధానం వచ్చింది. అప్పటి నుంచి చాటింగ్ కొనసాగింది. కేరళ లోని 'ఆనంద చెర్లాయం'లో రూ. 50 వేలు సభ్యత్వం కట్టి చేరాలని ఓ రోజు మెసేజ్ రాగా ఆ అభిమాని ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేసింది.

డబ్బు అవసరమై అమెరికాలోని భూమి అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. వాట్సాప్ చాటింగ్ లో ఎంత సన్నిహితంగా మెలిగినా ఒక్క రోజు కూడా వీడియో కాల్ కు అంగీకరించకపోవడం, కొత్తగా దిగిన ఫోటోలను పంపాలని కోరినా పంపక పోవడంతో అభిమానికి అనుమానం వచ్చింది. తనకు సింగర్ సునీత నెంబర్ ఇచ్చిన వ్యక్తే ఇదంతా చేస్తున్నారని గ్రహించి అతడితో పాటు మరికొంతమంది పై ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనిపై సింగర్ సునీత స్పందించారు. తన పేరు చెప్పి కొందరు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసిందని, ఎవరైనా తన పేరును ఉపయోగించుకుని ఇలాంటి వసూళ్లకు పాల్పడితే వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించాలని సూచించింది. ఎవరైనా తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటే నమ్మవద్దని కోరారు.
Tags: