Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల సార్ తో పనిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది: ధనుష్

By:  Tupaki Desk   |   19 Jun 2021 7:30 AM GMT
శేఖర్ కమ్ముల సార్ తో పనిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది: ధనుష్
X
పాన్ ఇండియా స్టార్ ధనుష్ - సెన్సిబుల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి వర్క్ చేయనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై రూపొందించనున్నారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దివంగత సునీతా నారంగ్ జయంతి సందర్భంగా నిన్న శుక్రవారం అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్రిభాషా చిత్రంగా తెలుగు, తమిళం, హిందీలో భారీ స్థాయిలో తెరకెక్కనుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ధనుష్ - శేఖర్ కమ్ముల అరుదైన కాంబోలో క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన రావడంతో, నిన్నటి నించి ఫిలిం సర్కిల్స్ లో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల - నారాయణ్ దాస్ కె నారంగ్ - పుస్కర్ రామ్ మోహన్ రావులతో కలిసి పనిచేస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందని హీరో ధనుష్ అన్నారు. "నేను ఆరాధించే దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల సార్‌ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ త్రిభాషా చిత్రం కోసం ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్‌ లో నారాయణ దాస్‌ నారంగ్ మరియు రామ్‌మోహన్ రావుతో చేతులు కలపడానికి సంతోషిస్తున్నాను. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ధనుష్ ట్వీట్ చేశాడు.

కాగా, ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం వివిధ భాషలకు సంబంధించిన బిగ్ స్టార్స్ మరియు అత్యున్నత సాంకేతిక బృందంతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఎప్పుడైనా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు తరువాత వెల్లడించబడతాయి.