Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్స్ దందాపై విరుచుకుపడ్డ తేజ

By:  Tupaki Desk   |   5 Oct 2022 1:30 AM GMT
మల్టీప్లెక్స్ దందాపై విరుచుకుపడ్డ తేజ
X
టాలీవుడ్లో ఏ విషయమైనా చాలా ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుల్లో తేజ ఒకడు. అందుకే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతుంటాయి. కొన్నిసార్లు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. తాజాగా ఆయన తన కొత్త చిత్రం ‘అహింస’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొవిడ్ తర్వాత మారిన పరిస్థితులు, థియేటర్ల భవితవ్యంపై ఆసక్తికర రీతిలో స్పందించారు.

జనాలు చాలా సెలక్టివ్‌గా థియేటర్లకు వస్తున్నారని, వాళ్లను మెప్పించడం అంత తేలిక కాదని తేజ వ్యాఖ్యానించారు. అందరూ బ్లాక్‌బస్టర్ అనుకుంటున్న ‘పుష్ప’ సినిమాకు కూడా బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రాలేదని.. తనకు తెలిసిన వాళ్ల థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా పెట్టుబడి కంటే తక్కువ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక థియేటర్లలో పాప్ కార్న్, ఇతర తినుబండారాల ధరల విషయంలో తేజ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు.

సినిమాకు సంబంధించి ప్రతిదీ ఖరీదైపోయిందంటూ.. టికెట్ బుక్ చేసుకున్నాక బుక్ మై షోలో వసూలు చేసే ఇంటర్నెట్ హ్యాండ్లిగ్ ఛార్జీలు ఎక్కువ ఉంటున్నాయని.. తర్వాత పార్కింగ్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోందని.. ఇక థియేటరుకు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడూ ఏమైనా తిందామని అనుకుంటాడని.. కానీ మల్టీప్లెక్సుల్లో క్యాంటీన్ ధరలు దారుణంగా ఉంటున్నాయని తేజ అన్నాడు.

థమ్సప్ క్యాన్ ధర కంపెనీ వాడు 7 రూపాయలకు అమ్ముతాడని, దాని ధర బయట రూ.20 అని, కానీ మల్టీప్లెక్సులోకి వచ్చేసరికి దాని రేటు 100 అవుతుందని.. ఐదో పదో లాభం అంటే ఓకే కానీ.. మరీ రూ.75-80 రూపాయలు లాభం తీసుకోవడం ఏంటని తేజ ప్రశ్నించాడు.

పది రూపాయల విలువైన పాప్ కార్న్‌ను రూ.400 పెట్టి అమ్మడం దారుణమని.. ఇలా ప్రతి చోటా దోచేస్తుంటే ప్రేక్షకుడు మల్టీప్లెక్సులకు వచ్చి ఏం సినిమా చూస్తాడని.. కానీ క్రమంగా సింగిల్ స్క్రీన్లు తగ్గిపోయి మల్టీప్లెక్సులే కమ్మేస్తున్నాయని.. హిందీ సినిమాలకు వసూళ్లు బాగా తగ్గిపోవడానికి మల్టీప్లెక్స్ సంస్కృతే కారణమని తేజ తేల్చేశాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.