Begin typing your search above and press return to search.

చిరంజీవి చెప్పిన వారం పది రోజులు గడిచిపోయింది.. నెక్స్ట్ ఏంటి..?

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:30 PM GMT
చిరంజీవి చెప్పిన వారం పది రోజులు గడిచిపోయింది.. నెక్స్ట్ ఏంటి..?
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం దీని గురించి చిరు వెల్లడిస్తూ.. చిత్ర పరిశ్రమలోని సమస్యలను సీఎంకు కూలంకషంగా వివరించానని.. ఈ సమావేశం పూర్తి సంతృప్తిగా జరిగిందని తెలిపారు. సినిమా టికెట్ల ధరలను పెంచాలని.. కోవిడ్‌ దృష్ట్యా కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకోవాలని.. నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

సామాన్యుడికి వినోదం అందించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని.. రెండో వైపు ఇండస్ట్రీలో ఉన్న కష్టాలను విని సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలియజేశారు. అతి త్వరలో దీనిపై ఓ డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటారని.. పాత జీవోపై పునరాలోచిస్తారని సీఎం చెప్పడం శుభవార్త అని అన్నారు. ఏపీ ప్రభుత్వం అందరికీ పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని.. మరో వారం పది రోజుల్లో అందOరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని భావిస్తున్నానని చిరంజీవి తెలిపారు.

ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరూ ఈలోపు దీనిపై నోరు జారవద్దని.. ఆందోళనతో వ్యక్తిగత స్టేట్మెంట్ ఇవ్వడం వంటివి చేయకుండా సంయమనం పాటించాలని.. ఇండస్ట్రీలో బిడ్డగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానని చిరంజీవి అన్నారు. అయితే మెగాస్టార్ ఒక్కటే వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి రావడంపై పలువురు విమర్శలు చేసారు. కానీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా ఏపీలో టికెట్ ఇష్యూ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. చిరు మీద భరోసాతో ఆయన మాటకు కట్టుబడి ఉన్నారని అనుకోవచ్చు.

ఏపీ సీయంతో చిరంజీవి భేటీ సంక్రాంతి పండుగ మొదటి రోజు జనవరి 13న జరిగింది. మెగాస్టార్ చెప్పిన వారం పది రోజుల గడువు పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల అంశం మీద ఎలాంటి ప్రకటన రాలేదు. సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు రెండు మూడు సార్లు సమావేశాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి కానీ.. వాటి సారాంశాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. డ్రాఫ్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

అలానే జగన్ మోహన్ రెడ్డి భేటీలో చర్చించిన అంశాలను ఫిలిం ఛాంబర్ - కౌన్సిల్ - గిల్డ్ సభ్యులకు వివరిస్తానని.. వీటిని మరో మీటింగ్ లో సీఎం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి చెప్పారు. కానీ ఇండస్ట్రీలో చిరు ఆధ్వర్యంలో అలాంటి సమావేశం జరిగినట్లుగా సమాచారం లేదు. కరోనా బారిన పడిన మెగాస్టార్ ప్రస్తుతం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న తర్వాత పరిశ్రమలోని ప్రముఖులతో చర్చిస్తారేమో చూడాలి.

ప్రస్తుతానికి పెద్ద సినిమాల విడుదల లేకపోవడం.. కరోనా కేసులు పెరుగుతుండటంతో టికెట్ ధరల గురించి ఇబ్బంది లేకుండా పోయింది. పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యే సమయానికి ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఏపీ సర్కారు చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందా? లేదా కమిటీ పేరుతో కాలాయాపన చేస్తుందా? అనేది చూడాలి.