Begin typing your search above and press return to search.

'వారసుడు' అలాంటి ప్లాప్ సినిమాల లైన్ తో ఉంటుందా..?

By:  Tupaki Desk   |   30 Jun 2022 1:30 AM GMT
వారసుడు అలాంటి ప్లాప్ సినిమాల లైన్ తో ఉంటుందా..?
X
డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరో విజయ్.. ఇప్పుడు "వారసుడు" చిత్రంతో నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. అయితే సినిమా నేపథ్యం గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే 'వారసుడు' టైటిల్ ను అనౌన్స్ చేసిన మేకర్స్.. విజయ్ కు సంబంధించిన మూడు లుక్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో తలపతి చాలా స్టైలిష్ గా ఉబర్ కూల్ లుక్ లో కనిపించారు. గత కొంతకాలంగా యాక్షన్ మూవీస్ చేస్తున్న స్టార్ హీరో.. ఈసారి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారని హింట్ ఇచ్చారు.

సినిమా టైటిల్ & 'ది బాస్ రిటర్న్స్' అని ట్యాగ్ లైన్ మరియు భారీ తారాగణం ఉండటంతో.. అందరూ అదే అనుకున్నారు. అయితే 'అజ్ఞాతవాసి' 'సాహో' వంటి సినిమాలకు దగ్గరగా ఉండే కథాంశంతో "వారసుడు" చిత్రం రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిజాస్టర్ మూవీ 'అజ్ఞాతవాసి'. దీనిపై కాపీ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ చిత్రం 'లార్గో వించ్' కు అనధికారిక రీమేక్ గా పిలవడింది. అప్పట్లో మేకర్స్ దీనిపై న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక కొంచం అటుఇటుగా అదే స్టోరీ లైన్ తో ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమాని రూపొందించారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇవే కాకుండా ఇలాంటి లైన్ తోనే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'వారసుడు' మూవీ కూడా ఇదే ప్లాట్ తో రాబోతోందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్ సాల్మన్ కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఇటీవల 'వారసుడు' ఫస్ట్ లుక్ తో ఇది 'మహర్షి 2' కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి 'మహర్షి' అనేది సక్సెస్ ఫుల్ మూవీ. జాతీయ అవార్డ్ కూడా సాధించింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీగా ఫ్యాన్స్ ఇలాంటి సినిమాని ఆశించలేదు. అందుకే వంశీని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ చిత్రంతో తన సత్తా ఏంటో చూపించాలని వంశీ తీవ్రంగా కష్టపడుతున్నారు.

'వారసుడు' సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త షణ్ముగం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

పీవీపీ సినిమాస్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 పొంగల్ కానుకగా 'వారసుడు' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు..