Begin typing your search above and press return to search.

'PS-1' తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:32 AM GMT
PS-1 తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేనా..?
X
తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ''పొన్నియన్ సెల్వన్''. వెయ్యేళ్ళ క్రితం నాటి చోళుల కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రూపొందించారు. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఈ సినిమాకు ఆధారం.

చోళ రాజుల పరిపాలనా విధానం.. పాండ్య రాజులతో జరిగే యుద్ధం గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. విస్తృతమైన కథ కావడంతో రెండు భాగాలుగా తీయాలని ముందే అనుకున్నారు. ఫస్ట్ పార్ట్ ని 'PS 1' అనే టైటిల్ తో రేపు రిలీజ్ చేస్తున్నారు.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతున్న 'పీఎస్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయితే మిగతా భాషల సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొదటిగా 'PS 1' అనే టైటిలే తెలుగు ఆడియన్స్ కు రిజిస్టర్ అవ్వలేదు. పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఒకే పేరుతో ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో.. 'పొన్నియన్ సెల్వన్ 1' అనే పబ్లిసిటీ చేశారు. దీంతో ఇదొక తమిళ సినిమా అనే భావన పడిపోయింది. 'ET' సినిమా మాదిరిగానే.. దీనికి కూడా టైటిల్ ఎఫెక్ట్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలానే తమిళులకు తెలిసినంతగా.. చోళులు - పాండ్యు రాజుల గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. విజయనగర రాజులు - కాకతీయుల చరిత్రతో కనెక్ట్ అయినట్లుగా 'పొన్నియన్ సెల్వన్' లో చెప్పే చోళుల కథాంశంతో కనెక్ట్ అవుతారా లేదా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఆ మధ్య మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మరక్కార్: అరేబియన్ సింహం' అనే మలయాళ సినిమాని తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే మొదటి నుంచీ 'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని మన 'బాహుబలి' సినిమాతో పోలుస్తూ వస్తున్నారు. అయితే ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ తో కంపేర్ చేయలేం అని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది. భారీ సెట్లు - వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో భారీతనం వచ్చిందేమో కానీ.. 'బాహుబలి' స్థాయిలో లేదనే కామెంట్స్ వచ్చాయి. రిలీజ్ తర్వాత కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 'బాహుబలి' అనేది విజయేంద్ర ప్రసాద్ రాసిన కల్పిత కథ. కాబట్టి ఇందులో రాజమౌళికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ మణిరత్నం తీసుకున్న కథాంశం చరిత్రలో జరిగింది. అందులోనూ తమిళ్ లో ఎక్కువగా అమ్ముడుపోయిన ఒక నవల ఆధారంగా తీసింది. తెర మీద ఆవిష్కరించడంతో కొన్ని పరిధులు ఉంటాయి. చరిత్రను వక్రీకరించకూడదు కాబట్టి.. వీటికి లోబడి ఎలాంటి సినిమా తీసారనేది చూడాలి.

కాగా, 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో విక్రమ్ - ఐశ్వర్యరాయ్ - త్రిష - కార్తీ - జయం రవి - శోభితా ధూళిపాళ్ల - ప్రకాష్ రాజ్ - ప్రభు - విక్రమ్ ప్రభు - ఐశ్వర్య లక్ష్మీ - శరత్ కుమార్ - జయరామ్ - రెహమాన్ - రాధాకృష్ణన్ పార్థీవన్ వంటి భారీ తారాగణం ఉంది.

లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 'PS 1' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.