Begin typing your search above and press return to search.

జక్కన్న సెంటిమెంట్ కి తారక్ - చరణ్ బ్రేక్ వేస్తారా...?

By:  Tupaki Desk   |   9 May 2020 1:30 PM GMT
జక్కన్న సెంటిమెంట్ కి తారక్ - చరణ్ బ్రేక్ వేస్తారా...?
X
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారనే విషయం అందరికి తెలిసిందే. ఇక మన టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సినిమా ప్లాప్ అయితే వాళ్ళ కారణంగానే సినిమా ప్లాప్ అయిందని వారిని ఇక దరిచేరనివ్వరు. ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. అదే సినిమా హిట్ అయితే మీ వల్లనే హిట్ అయింది అంటూ నెత్తిన పెట్టుకుంటారు. మరి కొందరు ఆడియో ఫంక్షన్స్ కి వస్తే ఫలితం వేరేలా ఉంటుందని.. కొందరు స్టార్ హీరోలు సినిమా ఓపెనింగ్ కి వస్తే మూవీ ప్లాప్ అవుద్దని.. సినిమా కంప్లీట్ అయ్యే దాకా గడ్డం పెంచుకుంటే సినిమా హిట్ అవుద్దని.. తలకి గుడ్డ కట్టుకుంటే విజయం వరిస్తుందని.. ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. అలానే మన దర్శకధీరుడు రాజమౌళికి సంభందించి ఒక సెంటిమెంట్ ఉంది.

రాజమౌళితో సినిమా తీసిన హీరోలు ఆ మూవీతో హిట్ కొట్టినప్పటికీ.. తర్వాత రోజుల్లో హిట్ సినిమా కోసం చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి అనే సెంటిమెంట్ బలంగా నమ్ముతుంటారు. ఇది నిజమే అన్నట్లు ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారు. జక్కన్న మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1'లో హీరోగా నటించిన ఎన్టీఆర్ కి వెంటనే 'సుబ్బు' లాంటి ప్లాప్ సినిమా వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన 'సింహాద్రి' సినిమా తర్వాత 'ఆంధ్రావాలా' 'సాంబా' 'నా అల్లుడు' 'నరసింహుడు' 'అశోక్' లాంటి ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. 'యమదొంగ' సినిమా తర్వాత 'కంత్రి' లాంటి ప్లాప్ సినిమా పడింది. ఇక జక్కన్నతో 'ఛత్రపతి' సినిమా తీసిన ప్రభాస్ వరుసగా అర డజను ప్లాపులను మూటగట్టుకున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత వచ్చిన 'సాహో' సినిమా హిందీలో కలెక్షన్స్ రాబట్టినప్పటికీ తెలుగులో మాత్రం ఆశించినంతగా ఆడలేదనే చెప్పవచ్చు.

'ఈగ' సినిమా తర్వాత నాని వరుసగా ఎన్ని ప్లాప్ సినిమాలు ఇచ్చాడో చూసాం. ఇక కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి తీసిన 'మర్యాద రామన్న' సినిమా తర్వాత ఆయనకి హీరో అనే ట్యాగ్ లైన్ లేకుండా పోయింది. వరుసగా సునీల్ హీరోగా నటించిన ప్రతీ సినిమా ప్లాప్ అవుతూ వచ్చింది. దీంతో సునీల్ కి 'హీరో' నుండి మళ్ళీ 'కమెడియన్'గా డిమోషన్ వచ్చింది. అంతేకాకుండా రాజమౌళితో 'మగధీర' తీసిన రామ్ చరణ్ వెంటనే 'ఆరెంజ్' లాంటి పరాజయాన్ని చవి చూసాడు. ఇవన్నీ చూసుకుంటే జక్కన్న సినిమా సెంటిమెంట్ నిజమే అనే అనుమానం అందరికి కలగకమానదు. అయితే ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' లాంటి భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ - తారక్ పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

జక్కన్న బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తాడన్న నమ్మకం కంటే.. జక్కన్న సినిమా సెంటిమెంటుకి అభిమానులు ఎక్కువగా కంగారు పడుతున్నారు. అందులోను తారక్ - చరణ్ ఇద్దరూ జక్కన్న సెంటిమెంట్ చేతిలో ఆల్రెడీ దెబ్బ తిన్న వాళ్లే. వీరిద్దరూ ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా ఏళ్ళే పట్టింది. ఇప్పుడు మరోసారి వారు ఆ సెంటిమెంట్ కి బలవుతారేమో అని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. మరి ట్రిపుల్ ఆర్ తరువాత వీరిద్దరూ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ లాంటి హిట్ డైరెక్టర్ ని లైన్లో పెట్టాడు. రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తారక్ - చరణ్ ఈ రెండు సినిమాలతో విజయాలు సొంతం చేసుకొని జక్కన్న సినిమా సెంటిమెంటుకి బ్రేక్ వేస్తారేమో చూడాలి.