Begin typing your search above and press return to search.

పద్మ అవార్డులకు సోనూసూద్ ని సిఫారసు చేస్తారా..?

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:31 AM GMT
పద్మ అవార్డులకు సోనూసూద్ ని సిఫారసు చేస్తారా..?
X
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరు ఆప‌ద ఉన్నా ఎక్కడ ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందు వస్తున్నాడు నటుడు సోనూసూద్. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. గతేడాది లాక్ డౌన్ లో ఎందరికో సాయం చేసిన సోనూ.. ఇప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వలస కార్మికులు - స్టూడెంట్స్ - పేదవాళ్లు - సామాన్యులు.. ఇలా ఎంతోమందికి ఏమి ఆశించకుండా ఆయన సేవ చేశారు.

కరోనా సోకిన వారికి వైద్యం అందించడం.. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులోకి తెచ్చి ఆదుకోవడం.. వంటి కార్యక్రమాలతో ప్రజల మదిలో మనసున్న మనిషిగా స్థానం సంపాదించారు. విపత్తు సమయంలో సోనూసూద్ సాయం వెలకట్టలేనిది. తన ఫౌండేషన్ ద్వారా అపరిమితమైన సాయం చేస్తున్న సోనూ.. ప్రజల పాలిట దైవంగా మారిపోయారు. సోనూ చేసిన సహాయానికి కృతజ్ఞతగా కొంతమంది ఏకంగా గుడికట్టి పూజలు చేస్తున్నారు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. తన సేవాగుణంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్న సోనూసూద్.. తాజాగా సివిల్ సర్వీసెస్‌ లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. 'సంభవం' పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ఉపకార వేతనాలు అందజేసేందుకు సోనూ ముందుకొచ్చారు. ఆప‌న్నుల‌కు సాయం చేస్తూ వస్తున్న సోనూసూద్ ను కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా గౌరవించాలని ప్రజలు కోరుతున్నారు. ఆయనకు 'పద్మ' అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

2022 సంవత్సరానికి గాను పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఈ గురువారం నుంచి నామినేషన్స్ కోరింది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాడు ఇవ్వడానికి సిఫారసులు చేయాలని కోరుతూ.. సెప్టెంబర్ రెండోవారం వరకు నామినేషన్లకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో సోనూసూద్ ను పద్మ అవార్డుకు నామినేట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. మరికొందరైతే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను అందుకునేందుకు సోనూకు అన్ని అర్హతలు ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవల సీనియ‌ర్ యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ ట్వీట్ చేస్తూ సోనూసూద్‌ కు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలని కోరాడు. 'ప‌ద్మ‌విభూష‌ణ్ ఫ‌ర్ సోనూసూద్' అనే హ్యాష్ ట్యాగ్‌ ను రీ ట్వీట్ చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరాడు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్‌.. 'బ్రదర్! 135 కోట్ల మంది భార‌తీయుల ప్రేమాభిమానాలే నాకు పెద్ద అవార్డు.. దాన్ని నేను ఇప్ప‌టికే సంపాదించుకున్నాను' అని సమాధానం ఇచ్చారు. మరి ప్రస్తుతం పద్మ అవార్డులకు నామినేషన్లు తీసుకుంటున్నారు కాబట్టి, సోనూ సూద్ ను సిఫారసు చేస్తారేమో చూడాలి.