Begin typing your search above and press return to search.

ఇంత‌కీ మ‌హేష్ డైరెక్ట‌ర్ తీస్తున్న సినిమా ఏంటీ?

By:  Tupaki Desk   |   12 May 2022 8:31 AM GMT
ఇంత‌కీ మ‌హేష్ డైరెక్ట‌ర్ తీస్తున్న సినిమా ఏంటీ?
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి సినిమా చేసి దాదాపు మూడేళ్లు పైనే అవుతోంది. మూడేళ్ల క్రితం ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం 'మ‌హ‌ర్షి'. సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా రెండు విభాగాల్లో జాతీయ పుర‌స్కారాల్ని ద‌క్కించుకుంది. బెస్ట్ హోల్ స‌మ్ ఎంట‌ర్ టైన‌ర్‌గా, అలాగే ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ విభాగాల్లో రెండు అవార్డుల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ మ‌హేష్ తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేసిన వంశీ పైడిప‌ల్లి ఆ విష‌యంలో ఫెయిల‌య్యాడు.

మ‌హేష్ ని ఒప్పించ‌డంతో విఫ‌ల‌మైన వంశీ పైడిప‌ల్లి మూడేళ్ల విరామం త‌రువాత మొత్తానికి క్రేజీ స్టార్ హీరో విజ‌య్ చేత ఓకే అనిపించుకున్నారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ కోసం వంశీ పైడిప‌ల్లి భారీ కాస్టింగ్ నే దించేశాడు.

కీల‌క పాత్ర‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, కిక్ శ్యామ్‌, ప్ర‌భు, జ‌య‌సుధ‌, శ్రీ‌కాంత్‌, సంగీత‌, సంయుక్త శ‌ణ్ముగ‌నాథ‌మ్‌, యోగిబాబు ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. వీరే భారీ తారాగ‌ణం అనుకుంటే మ‌రి కొంత మంది న‌టీన‌టులు కూడా ఇందులో న‌టించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్ న‌టిస్తున్న 66వ చిత్ర‌మిది. ఇటీవ‌ల విజ‌య్ న‌టించిన 'బీస్ట్‌' ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో ఇప్ప‌డు విజ‌య్ అభిమానుల‌తో పాటు అంద‌రి దృష్టి వంశీ పైడిప‌ల్లి సినిమాపైనే వుంది.

ఇదిలా వుంట‌లే ఇంత మంది కీల‌క న‌టీన‌టుల‌ని పెట్టుకుని వంశీ పైడిప‌ల్లి తీస్తున్న సినిమా ఏంటీ? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి కాస్టింగ్ తో ఏ సినిమా రాక‌పోవ‌డంతో విజ‌య్ - వంశీ పైడిప‌ల్లి సినిమాపై అంద‌రు ఆరా తీస్తున్నారు.

ఫ్యాన్స్ అయితే నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. ఇంత మందిని పెట్టుకుని ఏ సినిమా తీస్తున్నావు వంశీ అని కొంత మంది అభిమానులు, నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బ్ర‌హ్మాత్స‌వం లాంటి సినిమా చేస్తున్నావా? లేక ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నావా? అని సెటైర్లు వేస్తున్నారు.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే వంశీ పైడిప‌ల్లి గ‌తంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'బృందావ‌నం'ని విజ‌య్ తో రీమేక్ చేస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే క‌థ‌ని త‌మిళ నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి వంశీ పైడిప‌ల్లి కొత్త ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌పైకి తెస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై ద‌ర్శ‌కుడు ఇంత వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా వంశీ పైడిప‌ల్లి, హ‌రి, అహిషోర్ సాల్మ‌న్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.